వైసీపీ ప్రాజెక్టుల యాత్ర ఒక రాజకీయ నాటకం.. చంద్రబాబుపై అవాకులు పేలితే సహించం: కాలవ శ్రీనివాసులు

Kalava Srinivasulu slams YSRCP project yatra as political drama
  • ప్రాజెక్టుల సందర్శన యాత్రల పేరుతో వైసీపీ కొత్త నాటకాలకు తెరలేపిందని టీడీపీ విమర్శ
  • ఐదేళ్లలో సీమ ప్రాజెక్టులకు వైసీపీ ఖర్చు రూ.2,000 కోట్లేనని ఆరోపణ
  • రెండేళ్లలోనే తాము రూ.12,484 కోట్లు ఖర్చు చేశామని తెలిపిన టీడీపీ నేత కాలవ
  • అధికారంలో ఉన్నప్పుడు జగన్‌ను ఎందుకు ప్రశ్నించలేదని వైసీపీ నేతలను నిలదీత
  • మూడేళ్లలో రూ.35,313 కోట్లతో 36 ప్రాజెక్టులు పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమ‌ని వెల్ల‌డి
రాయలసీమ ప్రాజెక్టుల సందర్శన యాత్రల పేరుతో వైసీపీ నాయకులు సరికొత్త రాజకీయ నాటకాలకు తెరలేపారని, ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు వారికి లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము ఏ పనీ చేయమని, చేసేవాళ్లను చూస్తే కడుపుమంటతో విమర్శిస్తామని చెప్పడానికి వైసీపీ నేతల తీరే నిదర్శనమని ఆయన ఎద్దేవా చేశారు.

ఐదేళ్లలో మీరు చేసిందేమిటి?
గత ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, తాను రాయలసీమ బిడ్డనని చెప్పుకుంటూనే ఆ ప్రాంత భవిష్యత్తును నాశనం చేశారని కాలవ ఆరోపించారు. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు హయాంలో తాము రాయలసీమ ప్రాజెక్టుల కోసం రూ.12,500 కోట్లు ఖర్చు చేస్తే, జగన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో కేవలం రూ.2,000 కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శించారు. ముఖ్యంగా కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు జీవనాడి అయిన హంద్రీ-నీవా ప్రాజెక్టుకు కనీసం రూ.500 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని ఆయన మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే తమ ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టులపై ఏకంగా రూ.12,484 కోట్లు ఖర్చు చేసిందని, ఇది సీమ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమని అన్నారు. ఒక్క హంద్రీ-నీవా పైనే గత ఏడాదిలో రూ.3,870 కోట్లు వెచ్చించామని వివరించారు.

అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు?
"ప్రాజెక్టులు సందర్శించే హక్కు మీకు ఎక్కడిది? మీరేమైనా ప్రాజెక్టులు కట్టారా? మీ హయాంలో వాటి గురించి మాట్లాడారా?" అని వైసీపీ నేతలను కాలవ సూటిగా ప్రశ్నించారు. ఐదేళ్ల పాటు జగన్ రెడ్డి సీమ ప్రాజెక్టులను గాలికొదిలేసినప్పుడు, ఏ ఒక్క వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అయినా అసెంబ్లీలో గానీ, బయట గానీ నిలదీశారా అని నిలదీశారు. ఇప్పుడు పనికిమాలిన బృందంగా ఏర్పడి ప్రాజెక్టులను సందర్శిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, వారిని ప్రజలు నమ్మరని అన్నారు. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా మిగులు జలాలపై హక్కులు వదులుకుంటామని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు లేఖ ఇచ్చి రాయలసీమకు మరణశాసనం రాసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

ప్రాజెక్టుల విధ్వంసం వైసీపీ విధానం
జగన్ రెడ్డి హయాంలో ఏ ఒక్క ప్రాజెక్టూ ముందుకు సాగలేదని, ఒక తట్ట మట్టి ఎత్తిన పాపాన పోలేదని కాలవ శ్రీనివాసులు విమర్శించారు. పైగా, 102 ప్రాజెక్టులను రద్దు చేస్తూ జీవో 365 ఇచ్చారని గుర్తు చేశారు. హంద్రీ-నీవాకు కరెంట్ బిల్లులు కూడా కట్టలేని అసమర్థ ప్రభుత్వం జగన్‌ది అని దుయ్యబట్టారు. ఇప్పుడు తమ ప్రభుత్వం బిల్లులు కడుతూ, కాలువలు వెడల్పు చేస్తూ, ఎండాకాలంలోనూ చెరువులు నింపుతుంటే ఓర్వలేక యాత్రలు చేస్తున్నారని అన్నారు. ఈ చర్య ఆత్మహత్యాసదృశ్యమేనని వ్యాఖ్యానించారు. రైతుల పాలిట సంజీవని అయిన బిందు సేద్యం పథకాన్ని ఐదేళ్లుగా ఎందుకు ఆపేశారని జగన్‌ను ఏనాడైనా అడిగారా అని ‘గొడ్డలి పార్టీ’ నాయకులను ప్రశ్నించారు.

సీమ అభివృద్ధికి చంద్రబాబు కట్టుబడి ఉన్నారు
చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా మూడేళ్లలో 36 ప్రాజెక్టులను రూ.35,313 కోట్ల వ్యయంతో పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించామని కాలవ తెలిపారు. ఇందులో 14 ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయని, వాటి కోసం రూ.19,108 కోట్లు ఖర్చు చేయనున్నామని వెల్లడించారు. ఇది రాయలసీమ పట్ల చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. రాష్ట్ర విభజన సమయంలో చంద్రబాబు చాణక్యం వల్లే కృష్ణా జలాల్లో ఏపీకి 512 టీఎంసీల వాటా దక్కిందని గుర్తు చేశారు. ఒకవైపు సాగునీరు అందిస్తూ, మరోవైపు పండ్ల తోటలను, బిందు సేద్యాన్ని ప్రోత్సహిస్తూ రాయలసీమ వ్యవసాయ ముఖచిత్రాన్ని మారుస్తున్నామని ఆయన వివరించారు. అధికారంలో ఉన్న ఐదేళ్లు అరాచకాలతో రైతుల గొంతు కోసిన వైసీపీకి సీమకు నష్టం చేయడం తప్ప మేలు చేసే ఉద్దేశం లేదని, విజ్ఞులైన ప్రజలు చంద్రబాబు నాయకత్వానికే మద్దతు ఇస్తున్నారని కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు.
Advertisement
Kalava Srinivasulu
Rayalaseema irrigation projects
TDP vs YSRCP
Chandrababu Naidu
Handri Neeva project
Andhra Pradesh politics

More Telugu News