కొత్త ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లుతో భారతీయులకే తీవ్ర నష్టం: శశి థరూర్
- కొత్త చట్టం ద్వారా కేంద్రం విపరీతమైన అధికారాలను చేతుల్లోకి తీసుకుంటోందన్న థరూర్
- ఏదైనా సంస్థ ఆస్తులను ప్రభుత్వం సొంతం చేసుకోవడం ప్రమాదకరమని వ్యాఖ్య
- స్వచ్ఛంద సంస్థలను దెబ్బతీయడం వల్ల ప్రజలే నష్టపోతారన్న థరూర్
విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) సవరణ బిల్లు-2026పై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. విదేశీ నిధుల నియంత్రణ పేరిట కేంద్రం తెస్తున్న ఈ సవరణల వల్ల పారదర్శకత పెరగకపోగా... దేశంలోని విద్యా సంస్థలు, ఆసుపత్రులు, సేవా సంస్థలను నడిపే సామాజిక వర్గాలు, ముఖ్యంగా మైనారిటీలు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ కొత్త చట్టం ద్వారా ప్రభుత్వం విపరీతమైన అధికారాలను తన చేతుల్లోకి తీసుకుంటోందని థరూర్ ఆరోపించారు. ఏదైనా సంస్థకు చెందిన ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ పునరుద్ధరణ కాకపోతే లేదా రద్దయితే... ఆ విదేశీ నిధులతో దశాబ్దాలుగా నిర్మించిన ఆస్తులను, ఆసుపత్రులను, పాఠశాలలను స్వాధీనం చేసుకునే లేదా విక్రయించే అధికారాన్ని ప్రభుత్వం సొంతం చేసుకోవడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. నియంత్రణ పేరుతో పౌర సమాజాన్ని, స్వచ్ఛంద సంస్థలను క్రమంగా దెబ్బతీయడం వల్ల అంతిమంగా నష్టపోయేది సామాన్య భారతీయులేనని పేర్కొన్నారు. ఈ బిల్లును వెంటనే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపాలని, లేని పక్షంలో ప్రజాస్వామ్య బద్ధంగా తీవ్ర నిరోధకతను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.