చేనేతలకు సీఎం చంద్రబాబు కానుక.. ఒక్కో కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయం

Chandrababu Naidu gift to handloom weavers 25000 financial aid for each family
  • 'నేతన్న సేవలో' పథకం కింద ప్రతి చేనేత కుటుంబానికి రూ.25 వేల సాయం
  • చేనేత దినోత్సవం సందర్భంగా చీరాలలో సీఎం చేతుల మీదుగా పథకం ప్రారంభం
  • రాష్ట్రవ్యాప్తంగా 71,536 కుటుంబాలకు రూ.179 కోట్ల ప్రయోజనం
  • ఉచిత విద్యుత్, 50 ఏళ్లకే పింఛన్లతో పాటు పలు సంక్షేమ పథకాల అమలు
  • చీరాల పర్యటనలో నేతన్నలతో ముఖాముఖి భేటీ కానున్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో చేనేత కార్మికుల సంక్షేమానికి, వారి వృత్తిని పరిరక్షించేందుకు ప్రజా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. చేనేత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునే లక్ష్యంతో 'నేతన్న సేవలో' అనే సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 7వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాపట్ల జిల్లా చీరాలలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి రూ.25,000 చొప్పున ఆర్థిక సాయం అందనుంది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 71,536 చేనేత కుటుంబాలకు మొత్తం రూ.179 కోట్లు జమ కానున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వనప్పటికీ, చేనేత వృత్తిని, దాని వారసత్వాన్ని కాపాడాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ బృహత్తర పథకాన్ని అమలు చేస్తోంది.

ఈ కొత్త పథకంతో పాటు ఇప్పటికే ప్రభుత్వం చేనేత రంగానికి అనేక విధాలుగా మద్దతు అందిస్తోంది. చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్‌లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తోంది. దీనివల్ల 62,541 చేనేత కుటుంబాలు, 10,032 పవర్‌లూమ్ యూనిట్లకు ప్రయోజనం చేకూరుతోంది. ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.150 కోట్లు వెచ్చిస్తోంది. అంతేకాకుండా, చేనేతల వృద్ధాప్య పింఛన్ వయసును 50 ఏళ్లకు తగ్గించి, రాష్ట్రవ్యాప్తంగా 85 వేల మందికి నెలకు రూ.4,000 చొప్పున పింఛన్ అందిస్తోంది. ఈ పింఛన్ల కోసం ఏటా రూ.420 కోట్లు ఖర్చు చేస్తోంది. చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న ఈ భరోసా వారి జీవనోపాధికి అండగా నిలుస్తోంది.

చేనేత రంగాన్ని మౌలికంగా బలోపేతం చేసేందుకు కూడా ప్రభుత్వం దీర్ఘకాలిక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ రూపంలో రూ.79 కోట్లు అందించింది. ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్కు, రాజధాని అమరావతిలోని శాఖమూరులో చేనేత, హస్తకళల మ్యూజియం ఏర్పాటుకు కూడా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. భవిష్యత్తులో విశాఖపట్నంలో రూ.4,200 కోట్ల భారీ పెట్టుబడితో సుస్థిర టెక్స్‌టైల్ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు కానుండటం ఈ రంగ అభివృద్ధికి మరింత ఊతమివ్వనుంది.

ముఖ్యమంత్రి పర్యటన వివరాలు
ఈ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు చీరాలలో పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి, వేటపాలెం మండలం కొత్తపేటకు చేరుకుంటారు. ఉదయం 11:05 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1:35 గంటలకు జాండ్రపేటలో ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో నేతన్నలతో ముఖాముఖి నిర్వహిస్తారు. సాయంత్రం 4:10 గంటలకు కొత్తపేటలో టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశంలో పాల్గొని, తిరిగి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.
Advertisement
Nara Chandrababu Naidu
Nethanna Sevalo Scheme
Handloom Weavers Financial Assistance
Andhra Pradesh Government Schemes
Chirala Bapatla District
National Handloom Day 2024

More Telugu News