ఈటల వర్సెస్ సంజయ్ పోరుకు ముగింపు.. తెలంగాణ బీజేపీలో 3 జిల్లాల అధ్యక్షుల నియామకం
- తెలంగాణ బీజేపీలో ఈటల, బండి సంజయ్ మధ్య ఆధిపత్య పోరు
- రెండు వర్గాల పట్టుదల కారణంగా పెండింగ్లో పడిన 3 జిల్లాల అధ్యక్షుల నియామకాలు
- సుదీర్ఘ చర్చల అనంతరం కుదిరిన సయోధ్య
తెలంగాణ బీజేపీలో గత కొంతకాలంగా ఆధిపత్య పోరుతో తీవ్ర ఉత్కంఠ రేపిన మూడు జిల్లాల అధ్యక్షుల పీటముడి ఎట్టకేలకు వీడింది. పార్టీ కీలక నేతలు ఈటల రాజేందర్, బండి సంజయ్ వర్గాల నడుమ పట్టుదల కారణంగా పెండింగ్లో పడిన కరీంనగర్, వికారాబాద్, మేడ్చల్ (అర్బన్) జిల్లాల అధ్యక్షుల స్థానాలను భర్తీ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
ఇరువర్గాల ముఖ్య నేతల మధ్య సుదీర్ఘంగా సాగిన చర్చల అనంతరం సయోధ్య కుదరడంతో... కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా సాయి మల్లేశం, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా యూ. రమేశ్, అలాగే మేడ్చల్ (అర్బన్) జిల్లా అధ్యక్షుడిగా గిరివర్ధన్ రెడ్డిలను ఎంపిక చేశారు. అన్ని వర్గాలకూ ఆమోదయోగ్యమైన అభ్యర్థులకే పగ్గాలు అప్పగిస్తూ రాష్ట్ర నాయకత్వం ఈ కీలక నిర్ణయం తీసుకోవడంతో బీజేపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది.