మీ ఫోన్‌కు స్పామ్ కాల్స్ వస్తున్నాయా?.. 263 సంస్థలను బ్లాక్‌లిస్ట్ చేసిన కేంద్రం!

Central Government blacklists 263 firms to stop spam calls to your phone
  • స్పామ్ కాల్స్‌పై కొరడా ఝుళిపించిన కేంద్ర ప్రభుత్వం
  • ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 1.83 లక్షల సిమ్‌లపై వేటు
  • 263 టెలిమార్కెటింగ్ సంస్థలను బ్లాక్‌లిస్ట్ చేసినట్లు వెల్లడి
  • ఏఐ సాయంతో 2,443 కోట్ల స్పామ్ కాల్స్/ఎస్సెమ్మెస్‌ల గుర్తింపు
  • ఇప్పటికీ 112 కోట్ల మంది వినియోగదారులు డీఎన్డీ నమోదు చేసుకోలేదని వెల్లడి
దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులను వేధిస్తున్న అనవసర వాణిజ్య కాల్స్, సందేశాలపై (యూసీసీ) కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) ఏకంగా 1,83,000 టెలికాం వనరులపై చర్యలు తీసుకున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ నేడు వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘించిన 263 టెలిమార్కెటింగ్ సంస్థలను (సెండర్స్) బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినట్లు స్పష్టం చేసింది.

ఈ మూడు నెలల కాలంలో దేశంలోని టెలికాం నెట్‌వర్క్‌లో మొత్తం 73,082 కోట్ల కాల్స్ చోటుచేసుకోగా, వాటిలో 10.85 లక్షల ఫిర్యాదులు స్పామ్ కాల్స్‌కు సంబంధించి నమోదయ్యాయి. అంటే, ప్రతి పది లక్షల కాల్స్‌కు సగటున 1.5 ఫిర్యాదులు అందినట్లు ప్రభుత్వం పేర్కొంది. మొత్తం ఫిర్యాదుల్లో 89 శాతం 'ట్రాయ్'కు చెందిన డీఎన్డీ (డీఎన్‌డీ) యాప్ ద్వారానే వచ్చినట్లు తెలిపింది. స్పామ్ కాల్స్‌ను అరికట్టేందుకు బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నామని, ఇందులో భాగంగా అవుట్‌గోయింగ్ కాల్స్ నిలిపివేయడం, సిమ్ కార్డులను దీర్ఘకాలికంగా డిస్‌కనెక్ట్ చేయడం, అన్ని ఆపరేటర్ల నెట్‌వర్క్‌లలో సెండర్లను బ్లాక్‌లిస్ట్ చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నామని మంత్రిత్వ శాఖ వివరించింది.

టెక్నాలజీ సాయంతో కూడా స్పామ్ కాల్స్‌కు కళ్లెం వేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత వ్యవస్థ ద్వారా సుమారు 2,443 కోట్ల అనుమానిత స్పామ్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లను గుర్తించినట్లు వెల్లడించింది. దీనివల్ల వినియోగదారులు అప్రమత్తమై, ఆ కాల్స్‌ను తిరస్కరించడానికి లేదా జాగ్రత్తగా స్వీకరించడానికి అవకాశం కలిగింది. అంతేగాక‌ అనుమానిత సెండర్లకు కేవలం వారం రోజుల్లోనే 2.43 లక్షల హెచ్చరిక నోటిఫికేషన్లు జారీ చేసినట్లు పేర్కొంది.

వినియోగదారులు తమకు అనవసర ప్రచార కాల్స్, సందేశాలు రాకుండా ఉండేందుకు డీఎన్డీ (Do Not Disturb) సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. ట్రాయ్ డీఎన్డీ యాప్, టెలికాం సర్వీస్ ప్రొవైడర్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా, లేదా 1909 నంబర్‌కు కాల్ చేసి గానీ, ఎస్సెమ్మెస్ పంపి గానీ డీఎన్డీ ప్రాధాన్యతలను నమోదు చేసుకోవచ్చు. అయితే, ఇప్పటికీ దేశంలో 112 కోట్ల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు డీఎన్డీ కోసం నమోదు చేసుకోలేదని, దీంతో వారికి రిజిస్టర్డ్ టెలిమార్కెటర్ల నుంచి వాణిజ్య సందేశాలు వస్తున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. డీఎన్డీ నమోదు చేసుకున్న వారి ఫోన్లకు 148 కోట్ల ప్రచార కాల్స్, 730 కోట్ల ప్రచార ఎస్సెమ్మెస్‌లు రాకుండా విజయవంతంగా అడ్డుకున్నట్లు వివరించింది.

వినియోగదారుల సౌలభ్యం కోసం ప్రచార కాల్స్‌కు 140 సిరీస్‌ను, బ్యాంకింగ్, ఫైనాన్స్, ప్రభుత్వ సేవల వంటి లావాదేవీల కాల్స్‌కు 1600 సిరీస్‌ను ట్రాయ్ ప్రత్యేకంగా కేటాయించిన విషయాన్ని గుర్తు చేసింది. ఈ నంబర్ల ద్వారా కాల్స్ వస్తే వాటిని సులభంగా గుర్తించే వీలుంటుంది.
Advertisement
Central Government
Spam calls
TRAI
Ministry of Communications
DND registration
Telemarketing firms blacklisted

More Telugu News