రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టొద్దు.. అసంతృప్త ఎమ్మెల్యేలకు డీకే శివకుమార్‌ వార్నింగ్‌

DK Shivakumar warns disgruntled MLAs not to stake their political future
  • కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ
  • చోటు దక్కని కాంగ్రెస్‌ నేతల్లో అసంతృప్తి
  • రాజీనామా చేస్తామంటూ హెచ్చరికలు
  • మంత్రి పదవి కోసం రాజకీయ భవిష్యత్తును కోల్పోవద్దన్న సీఎం
  • వ్యక్తిగత ఆశయాల కంటే పార్టీ ముఖ్యమని హితవు
  • బోర్డులు, కార్పొరేషన్ల పునర్వ్యవస్థీకరణ జరుగుతోందని సూచన
కర్ణాటక మంత్రివర్గ విస్తరణ తర్వాత మంత్రి పదవులు దక్కక అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక సూచనలు చేశారు. మంత్రి పదవుల కోసం రాజకీయ భవిష్యత్‌ను పణంగా పెట్టొద్దని, వ్యక్తిగత ఆశయాల కంటే పార్టీనే ముఖ్యమని స్పష్టం చేశారు.

మంత్రి పదవులు రాకపోవడంతో కొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామంటున్నారన్న ప్రశ్నకు శివకుమార్ స్పందించారు. రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు సహజమేనన్నారు. ఎవరైనా రాజీనామా చేయాలని నిర్ణయించుకుంటే అడ్డుకోలేమని చెప్పారు. రాజకీయంగా ఎదగాలంటే పార్టీతోనే ప్రయాణం కొనసాగించాలని సూచించారు.

తన రాజకీయ జీవితంలోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని శివకుమార్ గుర్తుచేశారు. మాజీ ముఖ్యమంత్రులు ఎన్. ధర్మసింగ్, సిద్ధరామయ్య హయాంలో తనకు మంత్రి పదవి రాలేదన్నారు. అయినా సహనంతో కొనసాగానని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి జి. పరమేశ్వర కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.

మల్లికార్జున ఖర్గే, దివంగత ధర్మసింగ్‌, ఎస్. బంగారప్ప వంటి నేతలకు కూడా తొలుత మంత్రి పదవులు దక్కలేదని గుర్తు చేశారు. తర్వాత వారే ముఖ్యమంత్రి సహా కీలక పదవులు చేపట్టారని చెప్పారు. అందుకే ప్రస్తుతం అసంతృప్తితో ఉన్న నేతలు ఓపిగ్గా ఉండాలని సూచించారు.

అయితే ఎవరైనా ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ఆలస్యం చేయకుండా ఆమోదిస్తానని శివకుమార్ హెచ్చరించారు. రాష్ట్రంలో బోర్డులు, కార్పొరేషన్ల పునర్వ్యవస్థీకరణ జరుగుతోందని తెలిపారు. వాటితో పాటు మంత్రి పదవుల నియామకాలు కూడా రెండున్నరేళ్ల కాలపరిమితితో ఉంటాయని వెల్లడించారు. ముందుగా బోర్డులు, కార్పొరేషన్లలో ఉన్న పార్టీ ప్రతినిధుల రాజీనామాలు తీసుకుని, తర్వాత కొత్త నియామకాలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
Advertisement
DK Shivakumar
Karnataka Congress
Cabinet Expansion
Disgruntled MLAs
Siddaramaiah
Political Future

More Telugu News