ఎన్ఓసీ లేకున్నా కరెంట్ ఇవ్వండి.. అనధికార లేఅవుట్లపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు

AP High Court key verdict on electricity connections for unauthorized layouts without NOC
  • అనధికార లేఅవుట్లలోని ఇళ్లకు కరెంట్ కనెక్షన్ నిరాకరించొద్దన్న హైకోర్టు
  • పంచాయతీ ఎన్ఓసీ లేదన్న కారణంతో కనెక్షన్ ఆపడం తగదని వ్యాఖ్య
  • ఆక్రమణదారులకు కూడా విద్యుత్ పొందే అర్హత ఉందన్న ధర్మాసనం
  • పిటిషనర్ దరఖాస్తును పరిశీలించి కనెక్షన్ ఇవ్వాలని ఆదేశం
అనధికార లేఅవుట్లలో నిర్మించిన గృహాలకు విద్యుత్ కనెక్షన్ల మంజూరుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గ్రామ పంచాయతీ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) లేదన్న ఏకైక కారణంతో విద్యుత్ కనెక్షన్‌ను నిరాకరించకూడదని విద్యుత్ పంపిణీ సంస్థలను (డిస్కంలు) ఆదేశించింది. ఈ తీర్పుతో రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటున్న వేలాది మందికి భారీ ఊరట లభించింది.

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం పెదతీనార్ల గ్రామానికి చెందిన గరికిన సత్యరావు తన నూతన గృహానికి విద్యుత్ కనెక్షన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా, పంచాయతీ కార్యదర్శి నుంచి ఎన్ఓసీ సమర్పించలేదన్న కారణంతో ఏపీఈపీడీసీఎల్ అధికారులు కనెక్షన్ ఇచ్చేందుకు నిరాకరించారు. అధికారుల చర్యను సవాలు చేస్తూ సత్యరావు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు.. విద్యుత్ సరఫరా నిబంధనల ప్రకారం గృహాల్లో నివసిస్తున్న వారికి, ఆఖరికి ఆక్రమణదారులకు సైతం విద్యుత్ పొందే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా స్థలాన్ని కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్న వ్యక్తికి, కేవలం పంచాయతీ ఎన్ఓసీ లేదనే కారణంతో కరెంటు కనెక్షన్ నిరాకరించడం సరికాదని అభిప్రాయపడ్డారు.

పిటిషనర్ దరఖాస్తును పరిశీలించి, ఇతర అర్హతలన్నీ సక్రమంగా ఉన్న పక్షంలో మూడు వారాల్లోగా విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయాలని ఏపీఈపీడీసీఎల్ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పు అనధికార లేఅవుట్లలో నివసిస్తూ మౌలిక వసతుల కోసం ఇబ్బందులు పడుతున్న అనేకమందికి మార్గం సుగమం చేసింది.                                
Advertisement
Andhra Pradesh High Court
Electricity Connection
Unauthorized Layouts
APEPDCL
Gram Panchayat NOC
Justice Nimmagadda Venkateswarlu

More Telugu News