టాయిలెట్ బ్రేక్ ఇవ్వలేదని.. అధికారిని చంపిన కారు డ్రైవర్

Vimal Kumar Sasaram EO murdered by driver over toilet break
  • బీహార్‌లో మున్సిపల్ అధికారి విమల్ కుమార్ దారుణ హత్య
  • టాయిలెట్ బ్రేక్ ఇవ్వలేదన్న కోపంతోనే చంపినట్లు డ్రైవర్ అంగీకారం
  • హత్య వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందంటూ మృతుడి భార్య ఆరోపణ
  • తనపై రాజకీయ కుట్ర జరుగుతోందన్న ఎమ్మెల్యే
బీహార్‌లోని ససారం మున్సిపల్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) విమల్ కుమార్ దారుణ హత్యకు గురయ్యారు. టాయిలెట్ బ్రేక్ కోసం కారు ఆపడానికి నిరాకరించడంతోనే తన బాస్‌పై దాడి చేసి చంపినట్లు డ్రైవర్ మిథిలేష్ కుమార్ అంగీకరించడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అయితే, ఈ హత్య వెనుక స్థానిక ఎల్జేపీ (రామ్ విలాస్) ఎమ్మెల్యే హస్తం ఉందని మృతుడి భార్య ఆరోపించడం ఈ కేసులో సంచలనం సృష్టిస్తోంది.

పోలీసుల కథనం ప్రకారం, ఆదివారం రాత్రి పట్నాకు వెళ్తుండగా టాయిలెట్ కోసం కారు ఆపుతానని డ్రైవర్ చెప్పాడు. ఇందుకు ఈవో విమల్ కుమార్ నిరాకరించడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన డ్రైవర్, కారులో ఉన్న ఇనుప రాడ్‌తో అధికారిపై దాడి చేసి హత్య చేసినట్లు విచారణలో అంగీకరించాడు. మొదట గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని చెప్పిన డ్రైవర్, పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు నిజం ఒప్పుకున్నాడు. పని ఒత్తిడి, తరచూ జరిగే గొడవల వల్లే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపాడు.

ఈ ఘటనపై మృతుడి భార్య బబిత మాట్లాడుతూ దేహ్రీ ఎమ్మెల్యే రాజీవ్ రంజన్ సింగ్ (సోను సింగ్) తన భర్తను రూ. 50 లక్షలు, ఆ తర్వాత రూ. 25 లక్షలు ఇవ్వాలని వేధించారని సంచలన ఆరోపణలు చేశారు. డబ్బు ఇవ్వనందుకే ఎమ్మెల్యే తన భర్తను హత్య చేయించారని ఆమె ఆరోపించారు.

మరోవైపు ఎమ్మెల్యే సోను సింగ్ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. విమల్ కుమార్‌తో తనకు ఎలాంటి వివాదాలు లేవని, విచారణకు పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు. తనపై రాజకీయ దురుద్దేశంతోనే ఈ ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. పోలీసులు ప్రస్తుతం డ్రైవర్ పడేసిన ఇనుప రాడ్ కోసం గాలిస్తున్నారు. అన్ని ఆధారాలు పరిశీలించిన తర్వాతే తుది నిర్ధారణకు వస్తామని మగధ్ రేంజ్ ఐజీ వికాస్ వైభవ్ తెలిపారు.
Advertisement
Vimal Kumar
Sasaram EO murder
Mithilesh Kumar driver
Bihar officer killed
MLA Rajeev Ranjan Singh
LJP Ram Vilas

More Telugu News