ఏపీ లిక్కర్ స్కామ్: కీలక నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్‌రెడ్డి అరెస్ట్

AP Liquor Scam Key Accused Eshwar Kiran Kumar Reddy Arrested
  • శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న సిట్
  • షెల్ కంపెనీలు సృష్టించి లంచాల డబ్బు మళ్లించారనే ఆరోపణలు
  • ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో భారత్‌కు తిరుగుపయనం
  • మరో నిందితుడు సైఫ్ అహ్మద్ కూడా భారత్‌కు?
ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న భారీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు వేగం పుంజుకుంది. వేల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలున్న ఈ కేసులో తొమ్మిదో నిందితుడు (ఏ9) ఈశ్వర్ కిరణ్ కుమార్‌రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అరెస్ట్ చేసింది. సోమవారం రాత్రి శ్రీలంక నుంచి హైదరాబాద్ చేరుకున్న అతడిని శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఈశ్వర్ కిరణ్ రెడ్డిపై ఇప్పటికే లుకౌట్ నోటీసు జారీ కావడంతో, ఇమ్మిగ్రేషన్ అధికారులు అతడిని గుర్తించి సిట్ బృందానికి అప్పగించారు. అనంతరం సిట్ అధికారులు అతడిని విజయవాడకు తరలించారు. మంగళవారం విజయవాడలోని ఏసీబీ కోర్టులో అతడిని హాజరుపరచనున్నారు. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన రాజ్ కెసిరెడ్డికి ఈశ్వర్ కిరణ్ రెడ్డి అత్యంత సన్నిహితుడని, అతడి తరఫున కీలక వ్యవహారాలు చక్కబెట్టేవాడని దర్యాప్తులో తేలింది. లంచాల రూపంలో వచ్చిన భారీ మొత్తాలను దారి మళ్లించేందుకు ‘టెక్కర్’ వంటి పలు షెల్ కంపెనీలను సృష్టించడంలో ఇతడిది ప్రధాన పాత్ర అని అధికారులు గుర్తించారు.

రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత దర్యాప్తు ముమ్మరం కావడంతో, 2024 నవంబర్‌లో ఈశ్వర్ కిరణ్‌రెడ్డి దుబాయ్‌ పరారయ్యాడు. అప్పటి నుంచి విదేశాల్లోనే ఉంటూ ఇతర నిందితులకు కూడా ఆశ్రయం కల్పించినట్లు సమాచారం. ఇటీవల ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ధర్మాసనం ఆ పిటిషన్‌ను తిరస్కరించడమే కాకుండా వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో భారత్‌కు వస్తుండగా విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. ఇదే కేసులో మరో నిందితుడైన సైఫ్ అహ్మద్ (ఏ10) కూడా త్వరలోనే భారత్‌కు వస్తానని పేర్కొంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో సరెండర్ పిటిషన్ దాఖలు చేశాడు.                                
Advertisement
Eshwar Kiran Kumar Reddy
AP Liquor Scam
Andhra Pradesh SIT Arrest
Raj KC Reddy
Shamshabad Airport
Vijayawada ACB Court

More Telugu News