సీఎం విజయ్‌కు తొలి అగ్నిపరీక్ష.. కావేరి జలాలపై రాజకీయ రగడ!

CM Vijay first acid test political row over Cauvery waters
  • కావేరి రూపంలో విజయ్‌కు తొలి రాజకీయ సవాల్
  • కావేరి జలాలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటుకు డీఎంకే డిమాండ్
  • ప్రతిపక్షాల డిమాండ్‌ను తిరస్కరించిన విజయ్ ప్రభుత్వం
  • ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేశామంటున్న అధికార పార్టీ
  • ప్రభుత్వ వైఖరికి నిరసనగా తంజావూరులో భారీ ఆందోళనకు డీఎంకే పిలుపు
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌కు తొలి రాజకీయ అగ్నిపరీక్ష ఎదురైంది. దశాబ్దాలుగా నలుగుతున్న కావేరి జలాల వివాదం విషయంలో ఆయన వైఖరి ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను ఆయన ప్రభుత్వం తిరస్కరించడంతో రాజకీయ వేడి రాజుకుంది.

కావేరి సమస్యపై వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష డీఎంకే, ఇతర పార్టీలు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. అయితే, ఈ డిమాండ్‌ను విజయ్ నేతృత్వంలోని టీవీకే (తమిళగ వెట్రి కళగం) ప్రభుత్వం తోసిపుచ్చింది. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు ఈ అంశాన్ని వాడుకుంటున్నాయని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని ఆరోపిస్తోంది.

ఈ విషయంపై టీవీకే సీనియర్ నేత సీటీఆర్ నిర్మల్ కుమార్ స్పందిస్తూ.. "ఇప్పటికే అసెంబ్లీలో అన్ని పార్టీల మద్దతుతో ఏకగ్రీవంగా తీర్మానం చేశాం. అలాంటప్పుడు మళ్లీ అఖిలపక్ష సమావేశం ఎందుకు? కేవలం మా ముఖ్యమంత్రికి సమస్యలు సృష్టించాలనే డీఎంకే చూస్తోంది తప్ప, తమిళనాడు సంక్షేమం వారికి పట్టదు" అని విమర్శించారు.  

గతంలో కావేరి వివాదం తీవ్రమైనప్పుడు డీఎంకే, ఏఐఏడీఎంకే ప్రభుత్వాలు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించాయి. కానీ, టీవీకే ప్రభుత్వం భిన్నమైన వ్యూహంతో ముందుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి ఈ సమస్యపై చర్చించేందుకు సీఎం విజయ్ నేరుగా బెంగళూరు వెళ్లి కర్ణాటక ముఖ్యమంత్రితో మాట్లాడాలని భావించినా, అక్కడి ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆ పర్యటన రద్దయినట్లు సమాచారం. ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు (ఆగస్టు 3న) తంజావూరులో రైతుల సమస్యలు, కావేరి అంశంపై భారీ నిరసన చేపట్టాలని డీఎంకే నిర్ణయించింది.
Advertisement
Vijay
Cauvery Water Dispute
Tamilaga Vettri Kazhagam
DMK
Tamil Nadu Politics
CTR Nirmal Kumar

More Telugu News