హైడ్రాకు వెల్లువెత్తిన ప్రజా మద్దతు.. కొనసాగించాలంటూ హైదరాబాదులో ర్యాలీలు

HYDRA receives massive public support as Hyderabad residents hold rallies for its continuation
  • హైడ్రాకు సంఘీభావం తెలుపుతూ నగరంలో పలు సంక్షేమ సంఘాల ర్యాలీలు
  • వరద కట్టడి, చెరువుల పరిరక్షణ చర్యలను స్వాగతించిన నగరవాసులు
  • రెండేళ్లలో రూ. 1.50 లక్షల కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిందని ప్రశంసలు
  • సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని ఖండిస్తూ.. హైడ్రాను కొనసాగించాలని డిమాండ్
  • హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను కొనసాగించాలని విజ్ఞప్తి
హైదరాబాద్ నగరంలో వరద నివారణ, చెరువుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'హైడ్రా'కు ప్రజా మద్దతు వెల్లువెత్తింది. ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా, హైడ్రా పనితీరును ప్రశంసిస్తూ నగరంలోని పలు కాలనీల సంక్షేమ సంఘాలు ఆదివారం భారీ ర్యాలీలు నిర్వహించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేస్తూ, హైడ్రా కమిషనర్‌కు సంఘీభావం ప్రకటించాయి.

అమీర్‌పేట, మధురానగర్, శ్రీనివాసనగర్ పరిసర ప్రాంతాల్లో శ్రీనివాస నగర్ వెస్ట్, వెంగల్ రావు నగర్, మధుర నగర్ సహా పదుల సంఖ్యలో కాలనీ సంక్షేమ సంఘాలు ఈ ర్యాలీలలో పాల్గొన్నాయి. హైడ్రాపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ, ప్రభుత్వానికి తమ మద్దతును వీడియోల రూపంలో పంపించాయి.

గత రెండేళ్లలో హైడ్రా సాధించిన విజయాలే ఈ మద్దతుకు కారణమని సంఘాల ప్రతినిధులు తెలిపారు. సుమారు 3325 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడటంతో పాటు, రూ. 1.50 లక్షల కోట్ల విలువైన ఆస్తులను పరిరక్షించిందని వారు ప్రశంసించారు. రెండు విడతల్లో 20 చెరువులను పునరుద్ధరించి ఆయా ప్రాంతాల్లో వరద ముప్పును శాశ్వతంగా తొలగించడాన్ని నగర ప్రజలు కళ్లారా చూస్తున్నారని పేర్కొన్నారు.

ఒకప్పుడు 5 సెంటీమీటర్ల వర్షానికే అమీర్‌పేట, పరిసర ప్రాంతాలు నీట మునిగేవని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో హైడ్రా రంగంలోకి దిగిందని స్థానికులు గుర్తుచేశారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి, ఇరిగేషన్ శాఖలతో సమన్వయం చేసుకుంటూ వారం రోజుల్లోనే వరద సమస్యను పరిష్కరించిందని కొనియాడారు.

కొంతమంది కబ్జాదారులు, వారికి సహకరించే నాయకులు తమ ఆటలు సాగకపోవడంతోనే సోషల్ మీడియాలో హైడ్రాపై బురద చల్లుతున్నారని వారు ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ హైడ్రాను కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. కమిషనర్ ఏవీ రంగనాథ్ నేతృత్వంలోనే ఈ కార్యక్రమాలు కొనసాగాలని నినాదాలు చేశారు.

ఇటీవల, హైడ్రా కమిషనర్ గా  ఏవీ రంగనాథ్ ను తొలగించాలంటూ తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో, నేటి ప్రజా ర్యాలీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 
Advertisement
HYDRA
Revanth Reddy
AV Ranganath
Hyderabad Lake Restoration
Hyderabad Flood Prevention
Colony Welfare Association Rallies

More Telugu News