జెన్ జీ, ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానిస్తారా?: రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి ఫైర్
- ఉపాధ్యాయుల సమావేశంలో విద్యార్థులను రేవంత్ అవమానించారన్న కిషన్ రెడ్డి
- విద్యార్థులను క్రిమినల్స్తో పోల్చడం సరికాదని వ్యాఖ్య
- విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని హితవు
ఇటీవల ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలను కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇంజనీరింగ్ విద్యార్థులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవమానించారని మండిపడ్డారు. ఇది సరైన పద్ధతి కాదని... యువతను 'క్రిమినల్ వేస్ట్' అని సంబోధించడం అత్యంత బాధాకరమని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారనే అక్కసుతోనే రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలకు దిగారని ఆయన ఆరోపించారు.
దేశ నిర్మాణంలో ఇంజనీర్లు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. విద్యార్థులను క్రిమినల్స్తో పోల్చడం సిగ్గుచేటని మండిపడ్డారు. జెన్ జీ ఆకాంక్షలకు, భావాలకు వ్యతిరేకంగా పాలకులు వెళ్లడం సరికాదని హితవు పలికారు. రేవంత్ రెడ్డి విద్యార్థులపై నిందలు వేయడం మాని, రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు అవసరమైన విద్యా సంస్కరణలపై దృష్టి పెట్టాలని సూచించారు.