పోటెత్తుతున్న గోదావరి.. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
- భద్రాచలం వద్ద 48 అడుగులకు చేరుకున్న గోదావరి నీటి మట్టం
- నిండుకుండలా మారిన తెలంగాణలోని జలాశయాలు
- జలాశయాలకు వరద పెరుగుతుండటంతో అప్రమత్తమైన అధికారులు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వచ్చి చేరుతున్న భారీ వరదతో నీటి మట్టం మధ్యాహ్నానికి ఏకంగా 48 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం అధికారులు 11,44,507 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీటిప్రవాహం గంటగంటకూ పెరుగుతుండటంతో నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు, తెలంగాణలోని ప్రధాన జలాశయాలన్నీ వరద నీటితో నిండుకుండలా మారాయి. కడెం ప్రాజెక్టు నీటిమట్టం 698.02 అడుగులకు (పూర్తి స్థాయి 700 అడుగులు) చేరగా, 10,282 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదవుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 70 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, నీటిమట్టం 1069 అడుగుల వద్ద ఉంది.
ఇక శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు కాగా, ప్రస్తుతం 147.30 మీటర్లకు చేరుకుంది. ఎల్లంపల్లిలోకి 1,32,785 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండటంతో, అంతే మొత్తంలో (1,32,785 క్యూసెక్కులు) నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే మిడ్ మానేరు ప్రాజెక్టులోకి 18,445 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. జలాశయాల నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో ప్రాజెక్టుల వద్ద యంత్రాంగం నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తోంది.