ఒకరోజు ‘మావిగన్’, ఇంకోరోజు ‘బెంతాహై’.. జగన్‌పై మంత్రి లోకేశ్ సెటైర్లు

Nara Lokesh mocks Jagan over Mavigan and Bentahai comments
  • జగన్ రోజుకో మాట మార్చుతారంటూ విమర్శలు
  • రాయలసీమ అభివృద్ధికి జగన్ ఒక క్యాన్సర్ గడ్డలా మారారని వ్యాఖ్యలు
  • వైసీపీ ఒక హిట్ అండ్ రన్ పార్టీ అంటూ తీవ్ర ఆరోపణలు
  • పరిశ్రమలను బెదిరించి, యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారని ఆగ్రహం
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రోజుకో మాట, పూటకో వేషం వేస్తుంటారని, ఒకరోజు 'మావిగన్' అంటే, మరోరోజు 'బెంతాహై' అంటారని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో తాము చట్టప్రకారం పాలన చేస్తుంటే, లా అండ్ ఆర్డర్‌ను చేతుల్లోకి తీసుకోవాలని చూస్తే ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని చిన్నకొమెర్లలో దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్, వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

రాయలసీమ అభివృద్ధికి క్యాన్సర్ గడ్డ జగన్ 
రాయలసీమ అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి ఒక క్యాన్సర్ గడ్డలా మారారని లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ పేరుతో ప్రత్యక్షంగా 10 వేల ఉద్యోగాలు, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. 

"మైనింగ్ లైసెన్స్ తీసుకుని సుమారు 320 ఎకరాల్లో 'రెడ్ గోల్డ్' సంస్థ పేరుతో ఐరన్ ఓర్‌ను తరలించి విక్రయించుకున్నారు. దీనివల్ల గాలి జనార్ధన్ రెడ్డికి, జగన్‌కు ఆదాయం వచ్చింది తప్ప, కడప యువతకు ఒక్క ఉద్యోగం కూడా రాలేదు" అని విమర్శించారు. తాము తెచ్చిన కియా పరిశ్రమ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 30 వేల మంది జీవనం సాగిస్తున్నారని, ఇదే ప్రజాప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు.

పరిశ్రమలను బెదిరించిన గొడ్డలి పార్టీ 
2019 నుంచి 2024 వరకు కియా యాజమాన్యాన్ని గొడ్డలి పార్టీ నేతలు బెదిరించారని లోకేశ్ ఆరోపించారు. దాల్మియా సిమెంట్‌కైతే ఏకంగా ఫ్యాక్టరీ మూసేయాలని నోటీసులు ఇచ్చారని, డబ్బులిస్తేనే ఫ్యాక్టరీ నడుస్తుందని, లేదంటే మూసేయాలనే ధోరణిలో వైసీపీ నేతలు ప్రవర్తించారని అన్నారు. 

"మేం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో మూడుసార్లు కడప జిల్లాకు వచ్చాం. జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించాం, ఇప్పుడు దాల్మియా విస్తరణకు శంకుస్థాపన చేశాం. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణే మా నినాదం. దేశంలోనే రికార్డు స్థాయిలో రాష్ట్రానికి పరిశ్రమలు తెస్తున్నాం" అని తెలిపారు.

వైసీపీ ఒక ‘హిట్ అండ్ రన్’ పార్టీ 
జగన్ రెడ్డి పార్టీకి 'హిట్ అండ్ రన్ పార్టీ' అని పేరు పెట్టవచ్చని లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. "జగన్ కాన్వాయ్ వాహనం ఢీకొని ఆ పార్టీ కార్యకర్త సింగయ్య చనిపోతే, శవాన్ని రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. నిజాయతీ ఉంటే కోర్టుకు వెళ్లి స్టే ఎందుకు తెచ్చుకున్నారు? సొంత బాబాయ్‌నే హత్య చేస్తే తప్పు కాదు, కార్యకర్త చనిపోతే తప్పు కాదు" అని తీవ్రంగా విమర్శించారు.

తమ హయాంలో మత్స్యకారులు చనిపోతే ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చామని, కానీ జగన్ పాలనలో 250 మంది మత్స్యకారులు చనిపోతే వారి కుటుంబాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యోగాల కల్పనలో విఫలం
ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదని, కానీ తాము అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లోనే 16,000 డీఎస్సీ పోస్టులు భర్తీ చేశామని లోకేశ్ గుర్తుచేశారు. కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పూర్తి చేసి, త్వరలో కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. 

పెట్రోల్, డీజిల్ ధరలపై జగన్ చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ, "జగన్ హయాంలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగకపోయినా పెట్రోల్, డీజిల్ ధరలు రూ.35 పెంచారు. అప్పుడు నోరు మెదపని జగన్ ఇప్పుడు విమర్శించడం విడ్డూరంగా ఉంది. అధికారం పోతే ఒక నీతా?" అని ప్రశ్నించారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతామని, గండికోట జలాలను సమర్థంగా వినియోగించుకుంటామని లోకేశ్ స్పష్టం చేశారు.
Advertisement
Nara Lokesh
YS Jagan Mohan Reddy
Dalmia Cement Plant Kadapa
Rayalaseema Development
Andhra Pradesh Politics
YSRCP vs TDP

More Telugu News