తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ

AP Deputy CM Pawan Kalyan writes letter to Telangana CM Revanth Reddy
  • షాబాద్ ఘటనపై రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ
  • పోక్సో చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని విజ్ఞప్తి
  • పోక్సో కేసు నిందితుడు ఆరుగురిని హత్య చేసిన వైనం
  • పోలీసుల వైఫల్యం వల్లే ఈ ఘోరం జరిగిందని పవన్ ఆరోపణ
  • బాధితులకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారని విమర్శ
తెలంగాణ రాష్ట్రం షాబాద్‌లో చోటుచేసుకున్న ఘోర సామూహిక హత్యల ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన బుధవారం ఒక లేఖ రాశారు. పోక్సో చట్టాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని, బాధితులకు పూర్తిస్థాయి భద్రత కల్పించేలా కఠిన చర్యలు చేపట్టాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.

షాబాద్‌లో జరిగిన ఈ దారుణ ఉదంతాన్ని పవన్ కల్యాణ్ తన లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న రాజ్‌కుమార్, 16 ఏళ్ల బాధితురాలితో పాటు ఆమె తల్లి, నానమ్మను పొట్టనబెట్టుకున్నాడు. ఆ తర్వాత తనతో గొడవపడుతుందని భార్య, ఇద్దరు పిల్లలను చంపేసి, ఆపై తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణం వ్యవస్థీకృత వైఫల్యానికి నిదర్శనమని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. పోక్సో కేసుల్లో దర్యాప్తులో నిర్దిష్ట కాలపరిమితిని పాటించాలని, సాక్ష్యాధారాలు తారుమారుకు తావులేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

సదరు కేసులో నిందితుడికి ముందస్తు బెయిల్ లభించడం, అదే సమయంలో బాధితుల కుటుంబానికి తగిన రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమవడంపై పవన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పోక్సో కేసులకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీంకోర్టు గతంలో పలుమార్లు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
Advertisement
Pawan Kalyan
Revanth Reddy
Shabad murders
POCSO Act
Telangana
Victim protection

More Telugu News