'అభయ' కార్యక్రమాన్ని ప్రారంభించిన అనిత

Vangalapudi Anita launches Abhaya program
  • మహిళల భద్రత కోసం అనకాపల్లి పోలీసులు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్న అనిత
  • చట్టాలపై అందరికీ అవగాహన ఉండాలని సూచన
  • బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పిల్లలకు హితవు
సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు చాలా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. సైబర్ నేరాలపై ఓ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అనకాపల్లి జిల్లాలోని వేంపాడు టోల్ ప్లాజా సమీపంలోని భారతి కన్వెన్షన్‌లో 'అభయ' కార్యక్రమాన్ని హోం మంత్రి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా 'అభయ' పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, 'మహిళల భద్రత - మా బాధ్యత' అంటూ అనకాపల్లి పోలీసులు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ప్రశంసించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. 

ఎన్నో పోరాటాల వలన మహిళలకు స్వేచ్ఛ వచ్చిందని గుర్తు చేశారు. మహిళలకు ధైర్యం కల్పించడానికి 'అభయ' కార్యక్రమాన్ని పోలీసులు ప్రారంభించారని తెలిపారు. చట్టాలపై అందరికీ అవగాహన ఉండాలని మంత్రి అనిత అభిప్రాయపడ్డారు. శక్తి యాప్, శక్తి టీమ్స్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని చెప్పారు. పిల్లలను తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారని... కష్టపడి చదువుకొని, ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఈ సందర్భంగా పిల్లలకు ఆమె సూచించారు. 

ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలని అనిత సూచించారు. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే తక్షణమే 112కి కాల్ చేయాలని అన్నారు. చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయని వివరించారు. బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకండి అంటూ పిల్లలకు హితవు పలికారు. ప్రతి పాఠశాల, కళాశాలల్లో కూడా అభయ ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
Advertisement
Vangalapudi Anita
Abhaya Program
Women Safety Andhra Pradesh
Cybercrime Task Force
Anakapalle Police
Shakti App

More Telugu News