వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం... మృతుల కుటుంబాలకు అండగా ఉంటామన్న సీఎం చంద్రబాబు

Chandrababu Naidu expresses deep grief over Vietnam boat accident
  • వియత్నాం బోటు ప్రమాదంలో ముగ్గురు ఏపీ వాసుల మృతి
  • ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు
  • బాధితులను ఆదుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం
  • మృతదేహాల తరలింపునకు చర్యలు చేపట్టాలని సూచన
 వియత్నాంలో జరిగిన పర్యాటక బోటు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విహారయాత్ర విషాదంగా మారడం తనను ఎంతగానో కలచివేసిందని ఆయన ఆవేదన చెందారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

రాష్ట్రం నుంచి మొత్తం 33 మంది పర్యాటకులు వియత్నాం వెళ్లగా, వారిలో 19 మంది ప్రమాదానికి గురైన బోటులో ప్రయాణిస్తున్నారు. ఈ దుర్ఘటనలో కడప జిల్లాకు చెందిన ముడియం శ్రీధర్, కృష్ణా జిల్లా వాసి గెల్లి జయలక్ష్మి, సత్యసాయి జిల్లాకు చెందిన నల్లపేట ఆదిశేషయ్య రవితేజ ప్రాణాలు కోల్పోయారు. మరో పర్యాటకుడు, కృష్ణా జిల్లాకు చెందిన గెల్లి కిశోర్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. మిగిలిన వారంతా సురక్షితంగా ఉన్నారు.

ఈ ఘటనపై వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు, బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని, మిగిలిన వారిని సురక్షితంగా రాష్ట్రానికి తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం, స్థానిక అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. మృతుల దేహాలను వీలైనంత త్వరగా స్వస్థలాలకు తరలించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు
Advertisement
Chandrababu Naidu
Vietnam boat accident
Andhra Pradesh tourists
Vietnam boat tragedy
AP Bhavan Delhi
Indian Embassy Vietnam

More Telugu News