రైతాంగాన్ని రేవంత్ నిలువునా ముంచేస్తున్నారు: కేటీఆర్

KTR says Revanth Reddy is betraying the farmers in Telangana
  • మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు మూయకుండానే కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేయవచ్చన్న కేటీఆర్
  • 100 రోజుల్లో 200 టీఎంసీల నీటిని ఎత్తిపోయవచ్చని వ్యాఖ్య
  • కాళేశ్వరంను బద్నాం చేయాలనే కుట్రతోనే నీళ్లు ఇవ్వడం లేదని ఆరోపణ
తెలంగాణలో సాగునీటి సంక్షోభం, కాళేశ్వరం ప్రాజెక్టు నీటి ఎత్తిపోతలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన కేటీఆర్ మాట్లాడుతూ..
రాజకీయ కక్షతో సీఎం రేవంత్ రెడ్డి రైతాంగాన్ని నిలువునా ముంచేస్తున్నారని మండిపడ్డారు. 

రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం ఇచ్చిన నివేదికను చూసి సీఎం సోయి తెచ్చుకోవాలని అన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు మూసివేయకుండానే కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయవచ్చని ఫోరం సూచించిందని తెలిపారు. ప్రస్తుతం కన్నెపల్లి వద్ద 96.79 మీటర్ల నీటి ప్రవాహం ఉందని చెప్పారు. 94 మీటర్ల లభ్యత వద్దే పంపులు ఆన్ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారన్నారని... ఈ లెక్కన నీటిని పంప్ చేయవచ్చని అన్నారు.

ఎల్ నినో ప్రభావం ఉన్నా ఈ ప్రవాహం మరో 100 రోజులు కొనసాగుతుందని... రోజుకు 2 టీఎంసీల చొప్పున 200 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తే గోదావరి బేసిన్‌లోని అన్ని జలాశయాలను నింపి తెలంగాణను సస్యశ్యామలం చేయవచ్చని కేటీఆర్ వివరించారు. కానీ రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేయాలనే కుట్రతో నీళ్లివ్వడం లేదని ఆరోపించారు. 'ఇది కాలం తెచ్చిన కరవు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరవు' అని విమర్శించారు. రేవంత్ రెడ్డి పాలన కొనసాగితే కాంగ్రెస్‌కు 117 సీట్లు కాదు కదా... 7 సీట్లు కూడా రావని హెచ్చరించారు.
Advertisement
KTR
Revanth Reddy
Kaleshwaram Project
Telangana Water Crisis
Medigadda Barrage
BRS vs Congress Telangana

More Telugu News