'జన నాయగన్'కు సెన్సార్ క్లియరెన్స్.. అధికారికంగా ప్రకటించిన విజయ్.. అన్నీ కుదిరితే 24న రిలీజ్..?
- 'జననాయగన్' చిత్రానికి 'ఏ' సర్టిఫికెట్
- ఈ నెల 24న విడుదలయ్యే అవకాశం!
- విజయ్ సరసన హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే
- కీలక పాత్రలు పోషించిన మమిత బైజు, బాబీ డియోల్
తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. వాస్తవానికి ఈ ఏడాది సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా, సెన్సార్ బోర్డుతో సుదీర్ఘ వివాదాలు, కోర్టు చుట్టూ తిరగడం వల్ల గత ఏడు నెలలుగా ల్యాబ్కే పరిమితమైపోయింది. అయితే ఈ అడ్డంకులన్నింటినీ అధిగమించి, ఎట్టకేలకు సెన్సార్ బోర్డు నుంచి 'ఎ' సర్టిఫికెట్ సాధించుకుంది. ఈ విషయాన్ని విజయ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు.
తెలుగులో బ్లాక్బస్టర్ అయిన 'భగవంత్ కేసరి' సినిమాకు ఈ చిత్రం రీమేక్ లేదా కొన్ని ముఖ్యమైన సీన్ల స్ఫూర్తితో తెరకెక్కినట్లు ఇండస్ట్రీలో గట్టి ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై దర్శకుడు వినోద్ స్పందిస్తూ... ఇది పక్కా విజయ్ మార్క్ కమర్షియల్ చిత్రమని, థియేటర్లలో అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో విడుదలవుతున్న తొలి, చివరి సినిమా కావడంతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.