కోహ్లీ తీసుకున్న ఆ నిర్ణయం నాకు నచ్చలేదు: కపిల్ దేవ్
- విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్పై కపిల్ దేవ్ అసంతృప్తి
- కోపం, బాధతోనే కోహ్లీ ఆ నిర్ణయం తీసుకున్నాడని వ్యాఖ్య
- కోహ్లీ తొందరపడి రిటైర్మెంట్ ప్రకటించాడని అభిప్రాయం
2025 మే 12న విరాట్ కోహ్లీ అనూహ్యంగా టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దీనిపై స్పందించిన కపిల్ దేవ్, "విరాట్ టెస్టుల నుంచి రిటైర్ అవ్వడం నాకు సంతోషాన్నివ్వలేదు. తనలోని ఆవేశాన్ని లేదా నిరాశను అధిగమించేందుకు అతడు మరికొంత సమయం తీసుకుని ఉండాల్సింది. అతడిలో ఇంకా ఎంతో క్రికెట్ మిగిలి ఉంది, కానీ అకాల నిర్ణయంతో అర్ధాంతరంగా తప్పుకున్నాడు" అని పేర్కొన్నాడు.
36 ఏళ్ల వయసులో కోహ్లీ తన 14 ఏళ్ల సుదీర్ఘ టెస్ట్ ప్రయాణానికి స్వస్తి పలికాడు. కెరీర్లో మొత్తం 123 టెస్టులు ఆడిన కోహ్లీ... 46.85 సగటుతో 9,230 పరుగులు సాధించాడు. ముఖ్యంగా విదేశీ గడ్డపై భారత్కు చారిత్రక విజయాలు అందించడంలో అతడిది కీలక పాత్ర. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సమయంలో ఫామ్ లేమితో సతమతమవ్వడం, ఆపై భావోద్వేగపూరితమైన సోషల్ మీడియా పోస్ట్తో రిటైర్మెంట్ ప్రకటించడం క్రీడాభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. కోహ్లీలోని దూకుడైన స్వభావాన్ని టెన్నిస్ దిగ్గజం జాన్ మెకెన్రోతో పోల్చిన కపిల్, ఆ తీవ్రతే త్వరగా రిటైర్మెంట్ ప్రకటించేలా ప్రేరేపించి ఉండవచ్చని వ్యాఖ్యానించాడు.