ప్రజా జీవితంలో రేవంత్ రెడ్డి 20 ఏళ్లు.. జడ్పీటీసీ నుంచి సీఎం దాకా!

Revanth Reddy 20 Years in Public Life From ZPTC to CM
  • 2006లో మిడ్జిల్ జడ్పీటీసీగా రాజకీయ అరంగేట్రం
  • తన తొలి గెలుపునకు వేదికైన మిడ్జిల్‌లో కృతజ్ఞతా కార్యక్రమం
  • జడ్పీటీసీ నుంచి సీఎం స్థాయికి ఎదిగిన రాజకీయ ప్రయాణం
  • ప్రజల ఆకాంక్షల నెరవేర్పుకే కృషి చేస్తానన్న రేవంత్
ప్రజా ప్రతినిధిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ చారిత్రక మైలురాయిని పురస్కరించుకుని, తన రాజకీయ జీవితానికి పునాది వేసిన మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో శనివారం ఆయన పర్యటించారు. సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం, 2006 జులై 4న ఇదే మిడ్జిల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా జడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించి రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టారు.

ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని సామాన్య కుటుంబం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి, 2007లో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన, 2018 ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ పట్టువదలకుండా 2019లో మల్కాజ్‌గిరి ఎంపీగా ఘనవిజయం సాధించారు. 2021లో టీపీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టి, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

మిడ్జిల్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఉర్కొండ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. తన రాజకీయ ప్రస్థానం తొలినాళ్లలో అండగా నిలిచిన మద్దతుదారులు, నాయకులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ తన రెండు దశాబ్దాల ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు.

"మిడ్జిల్ రేవంత్ రెడ్డి నుంచి ప్రతి గుండెలో 'రేవంత్ అన్న' వరకు సాగిన ఈ అద్భుత ప్రయాణం నా జీవితంలో ఒక ప్రత్యేక అధ్యాయం" అని ఆయన 'ఎక్స్' వేదికగా భావోద్వేగపూరిత పోస్ట్ చేశారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సహా పలువురు నేతలు రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన ఆయన ప్రస్థానానికి ఈ కార్యక్రమం అద్దం పట్టింది.
Revanth Reddy
Telangana Chief Minister
Revanth Reddy 20 Years Politics
Midjil Mahabubnagar Visit

More Telugu News