హైదరాబాద్లో భారీ మోసం: కార్ల వ్యాపారం పేరుతో రూ.1.58 కోట్లకు టోపీ!
- యూజ్డ్ కార్ల వ్యాపారం పేరుతో భారీ మోసం
- కార్స్24 సంస్థతో సంబంధం ఉందని చెప్పి పెట్టుబడులు సేకరణ
- వాజిద్ ఖాన్, అతని భార్యపై సీసీఎస్ కేసు
- అధిక లాభాల ఆశ చూపి పలువురిని మోసగించినట్లు ఆరోపణలు
- ఒక బాధితుడి నుంచే రూ.58 లక్షలు వసూలు చేసిన నిందితులు
బాధితుల్లో ఒకరైన రయీస్ అహ్మద్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఉదంతం బయటపడింది. నిందితుడైన వాజిద్ అహ్మద్ ఖాన్ తనకు వ్యక్తిగతంగా పరిచయమని, గత నవంబర్లో తనను సంప్రదించాడని రయీస్ తెలిపారు. కార్స్24 సంస్థ ద్వారా పాత కార్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి, వాటిని అధిక లాభాలకు విక్రయించవచ్చని, అయితే తన వద్ద సరిపడా పెట్టుబడి లేదని వాజిద్ నమ్మబలికాడు.
పెట్టుబడికి పూర్తి భద్రతతో పాటు ఆకర్షణీయమైన లాభాలు వస్తాయని వాజిద్ ఇచ్చిన హామీని నమ్మిన రయీస్, సుమారు రూ.58 లక్షలు పెట్టుబడిగా పెట్టారు. ఈ మొత్తాన్ని వాజిద్తో పాటు అతని భార్యకు చెందిన బ్యాంకు ఖాతాలకు వివిధ విడతల్లో బదిలీ చేసినట్లు రయీస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
రయీస్తో పాటు అతని స్నేహితులు, ఇతర పరిచయస్తుల నుంచి కూడా నిందితులు ఇదే పద్ధతిలో భారీగా పెట్టుబడులు సేకరించారు. బాధితులందరి నుంచి వసూలు చేసిన మొత్తం రూ.1.58 కోట్లు దాటినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) కింద చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.