జూన్‌లో జీఎస్టీ వసూళ్ల జోరు.. రూ.1.94 లక్షల కోట్లు దాటిన ఆదాయం

GST collections surge in June revenue exceeds 194 lakh crore
  • గతేడాది ఇదే నెలతో పోలిస్తే 13.9 శాతం వృద్ధి నమోదు
  • దిగుమతులపై జీఎస్టీ రాబడి 34.6 శాతం పెరగడమే ప్రధాన కారణం
  • ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.6.31 లక్షల కోట్లు దాటిన మొత్తం వసూళ్లు
దేశంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు మరోసారి భారీగా నమోదయ్యాయి. ఈ ఏడాది జూన్ నెలలో స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1.94 లక్షల కోట్లు దాటింది. నేడు విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం గతేడాది ఇదే నెలతో పోలిస్తే వసూళ్లు 13.9 శాతం పెరిగాయి. ముఖ్యంగా దిగుమతులపై వచ్చే పన్ను రాబడి గణనీయంగా పెరగడం ఈ వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచింది.

వివరాల్లోకి వెళితే.. 2026 జూన్ నెలలో స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,94,812 కోట్లుగా నమోదైంది. గత సంవత్సరం జూన్‌లో ఈ మొత్తం రూ.1,71,105 కోట్లుగా ఉంది. ఈ పెరుగుదలలో దిగుమతులపై వచ్చే జీఎస్టీ వాటానే అధికం. దిగుమతులపై పన్ను రాబడి ఏకంగా 34.6 శాతం పెరిగి రూ.60,038 కోట్లకు చేరుకుంది. అయితే, దేశీయ లావాదేవీల ద్వారా సమకూరిన జీఎస్టీ ఆదాయం మాత్రం 6.5 శాతం వృద్ధితో రూ.1,34,774 కోట్లుగా నమోదైంది. దేశీయ వసూళ్ల వృద్ధి రేటు కంటే దిగుమతులపై వసూళ్ల వృద్ధి రేటు ఎక్కువగా ఉండటం గమనార్హం.

రిఫండ్‌ల తర్వాత ప్రభుత్వానికి అందిన నికర జీఎస్టీ ఆదాయం జూన్‌లో 11.2 శాతం వృద్ధితో రూ.1,62,377 కోట్లకు చేరింది. గతేడాది ఇదే నెలలో నికర వసూళ్లు రూ.1,45,984 కోట్లుగా ఉన్నాయి. ఈసారి మొత్తం రిఫండ్‌లు కూడా దాదాపు 30 శాతం పెరిగి రూ.32,436 కోట్లుగా నమోదయ్యాయి. ఇందులో దేశీయ రిఫండ్‌లు 42.9 శాతం పెరిగి రూ.17,767 కోట్లకు చేరగా, ఎగుమతులపై 'ఐస్‌గేట్' (ICEGATE) ద్వారా ఇచ్చిన రిఫండ్‌లు 15.6 శాతం పెరిగి రూ.14,669 కోట్లుగా ఉన్నాయి.

ఇక‌, నికర ఆదాయాన్ని విశ్లేషిస్తే.. దేశీయ లావాదేవీలపై వచ్చిన నికర జీఎస్టీ రాబడి కేవలం 2.6 శాతం మాత్రమే పెరిగి రూ.1,17,007 కోట్లుగా ఉంది. అదే సమయంలో దిగుమతులపై వచ్చిన నికర కస్టమ్స్ జీఎస్టీ ఆదాయం ఏకంగా 42.2 శాతం పెరిగి రూ.45,370 కోట్లకు చేరింది. ఇది దిగుమతులపై ఆధారపడి పన్ను వసూళ్లు ఎంతగా పెరిగాయో స్పష్టం చేస్తోంది.

ఇక, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) గణాంకాలను పరిశీలిస్తే.. స్థూల జీఎస్టీ వసూళ్లు 8.4 శాతం వృద్ధితో రూ.6,31,699 కోట్లకు చేరాయి. గతేడాది ఇదే సమయంలో ఈ వసూళ్లు రూ.5,82,542 కోట్లుగా ఉన్నాయి. ఇదే కాలంలో నికర జీఎస్టీ రాబడి 7.1 శాతం పెరిగి రూ.5,40,218 కోట్లుగా నమోదైంది. మే నెలలో కూడా జీఎస్టీ వసూళ్లు రూ.1.94 లక్షల కోట్లుగా నమోదవగా, జూన్‌లోనూ అదే స్థాయి వసూళ్లు కొనసాగడం ఆర్థిక వ్యవస్థ పటిష్ఠతకు సూచికగా నిపుణులు భావిస్తున్నారు.
GST
GST Collection June
Indian Economy
Indirect Tax Revenue
Finance Ministry India
GST Revenue Growth

More Telugu News