భారత మార్కెట్కు మళ్లీ ఐదో ర్యాంక్.. విదేశీ పెట్టుబడులతో దూకుడు
- 5 ట్రిలియన్ డాలర్ల మార్క్ను దాటిన భారత ఈక్విటీ మార్కెట్ క్యాపిటలైజేషన్
- ప్రపంచ మార్కెట్ క్యాప్ ర్యాంకింగ్స్లో తిరిగి ఐదో స్థానానికి చేరిన భారత్
- తైవాన్, దక్షిణ కొరియా మార్కెట్లను వెనక్కి నెట్టి ఈ ఘనత
- ప్రపంచ మార్కెట్లు నష్టపోతున్నా స్థిరంగా నిలిచిన భారత ఈక్విటీలు
- తగ్గుతున్న ముడి చమురు ధరలు, విదేశీ పెట్టుబడులు ప్రధాన కారణం
ఇటీవలి కాలంలో ప్రపంచ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతుండగా, భారత మార్కెట్లు మాత్రం స్థిరంగా రాణిస్తున్నాయి. జూన్ నెలలో అనేక అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. కానీ, భారత మార్కెట్లు మాత్రం మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. ఈ నెలలో భారత్ మార్కెట్ క్యాప్ 2.75% పెరగ్గా, సమీప పోటీదారులైన దక్షిణ కొరియా 4.7%, తైవాన్ 2.3% మేర నష్టపోయాయి. దీంతో భారత్ ఐదో స్థానానికి చేరేందుకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం భారత్ మార్కెట్ విలువ 5 ట్రిలియన్ డాలర్లు కాగా, తైవాన్ (4.97 ట్రిలియన్ డాలర్లు), దక్షిణ కొరియా (4.66 ట్రిలియన్ డాలర్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
గత కొన్ని నెలలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సెమీకండక్టర్ స్టాక్స్ కారణంగా రికార్డు స్థాయిలో లాభపడిన తైవాన్, దక్షిణ కొరియా మార్కెట్లలో మదుపరులు ఇప్పుడు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు. దీనివల్ల ఆయా మార్కెట్లలో కరెక్షన్ చోటుచేసుకుంది. ఇదే సమయంలో అమెరికా, చైనా మార్కెట్ క్యాప్లలో పెద్దగా మార్పులు కనిపించలేదు.
భారత మార్కెట్ల స్థిరత్వానికి పలు అంశాలు దోహదం చేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగిరావడం, వాల్యుయేషన్లు ఆకర్షణీయంగా మారడం, విదేశీ పెట్టుబడులు నిలకడగా కొనసాగడం వంటివి భారత మార్కెట్లకు అండగా నిలుస్తున్నాయని వారు విశ్లేషిస్తున్నారు. నిఫ్టీ ప్రైస్-టు-ఎర్నింగ్స్ (పీఈ) నిష్పత్తి 24 నుంచి 18కి తగ్గడం కూడా మదుపరులను ఆకట్టుకుంటోందని నిపుణులు చెబుతున్నారు. ఈ నెలలో డాలర్ల పరంగా చూస్తే సెన్సెక్స్ దాదాపు 4%, నిఫ్టీ 3% మేర లాభపడటం విశేషం.