'లాపతా లేడీస్' నటుడికి నడిరోడ్డుపై దెబ్బలు.. రెమ్యునరేషన్ అడిగితే చంపేస్తామని డైరెక్టర్ వార్నింగ్!
- 'లాపతా లేడీస్' చిత్రంలో 'చోటూ' పాత్రతో మెప్పించిన సత్యేంద్ర సోని
- 'పేడ్ పాల్కి' చిత్ర షూటింగ్ ముగిసిన తర్వాత రెమ్యునరేషన్ అడగడంతో వివాదం
- డైరెక్టర్ పుష్పేంద్ర సింగ్, ఆయన భార్య ప్రగతి చౌహాన్ కొట్టారని సత్యేంద్ర ఆవేదన
- డబ్బులు అడిగితే చంపేస్తామని బెదిరించారంటూ ఇన్స్టాగ్రామ్లో కన్నీటి వీడియో
- మధ్యప్రదేశ్ పోలీసుల సాయంతో సురక్షితంగా ముంబై చేరుకున్న నటుడు
- బాధ్యులపై చర్యలకు 'సినిమా వర్కర్స్ అసోసియేషన్' డిమాండ్
మధ్యప్రదేశ్లోని మైహార్లో జరుగుతున్న 'పేడ్ పాల్కి' చిత్ర షూటింగ్ స్పాట్లో ఈ ఘటన జరిగింది. సత్యేంద్ర సోని తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సినిమాకు పుష్పేంద్ర సింగ్ దర్శక-నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సినిమా సైనింగ్ అమౌంట్గా రూ. 50,000 ఇచ్చిన చిత్ర బృందం, మిగిలిన మొత్తాన్ని షూటింగ్ ముగిశాక ఇస్తామని ఒప్పందం చేసుకుంది. దాదాపు 8 రోజుల పాటు షూటింగ్లో పాల్గొన్న సత్యేంద్ర, తన మిగిలిన డబ్బుల గురించి అడగడంతో డైరెక్టర్ పుష్పేంద్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. 10 నిమిషాల్లో హోటల్ రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలని, మళ్లీ ఇక్కడ కనిపిస్తే చంపేస్తానని హెచ్చరించాడు. ఆ సినిమా హీరోయిన్, డైరెక్టర్ భార్య అయిన ప్రగతి చౌహాన్ కూడా తనను బూతులు తిడుతూ హోటల్ నుంచి గెంటివేసిందని సత్యేంద్ర కన్నీరు పెట్టుకున్నాడు.
అంతటితో ఆగకుండా, భయంతో హోటల్ నుంచి బయటకు వచ్చేసిన సత్యేంద్ర, సహ నటులు శ్రీధర్ దూబే, పంకజ్ శర్మలను డైరెక్టర్ పుష్పేంద్ర, ఆయన భార్య కారులో వెంబడించారు. నడిరోడ్డుపై తమను అడ్డుకుని మొబైల్ ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారని, విచక్షణరహితంగా దాడి చేశారని సత్యేంద్ర ఆరోపించాడు. అడ్డువచ్చిన తోటి నటులను కూడా చితకబాదారని పేర్కొన్నాడు. ఈ అవమానంతో కుంగిపోయిన సత్యేంద్ర, రైల్వే స్టేషన్ నుంచి ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టి తన బాధను పంచుకున్నాడు.
ఈ వీడియో వైరల్ కావడంతో ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ (ఏఐసీడబ్ల్యూఏ) తీవ్రంగా స్పందించింది. నటుడికి మద్దతుగా నిలుస్తూ.. సదరు దర్శకుడు, నిర్మాతలపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ను డిమాండ్ చేసింది. ప్రస్తుతం మైహార్ పోలీసుల రక్షణతో సత్యేంద్ర సోని సురక్షితంగా ముంబై చేరుకున్నాడు.