ఇదే అసలైన శివసేన: అమిత్ షా
- శివసేనలో ఇకపై ఎలాంటి గ్రూపులు లేవన్న అమిత్ షా
- ఏక్ నాథ్ షిండేదే అసలైన శివసేన అని వ్యాఖ్య
- శివసేన పూర్తిగా షిండే నేతృత్వంలో నడుస్తోందన్న కేంద్ర హోంమంత్రి
మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఉద్ధవ్ థాకరేకు చెందిన శివసేన (యూబీటీ) శిబిరంలో అంతర్గత తిరుగుబాటు భయాలు నివురు గప్పిన నిప్పులా నడుస్తున్న తరుణంలో... కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శివసేనలో ఇకపై ఎలాంటి గ్రూపులు, విభజనలు లేవని.. ఏక్ నాథ్ షిండే నడిపిస్తున్నదే అసలైన, ఏకైక శివసేన అని ఆయన స్పష్టమైన స్టేట్మెంట్ ఇచ్చారు.
కొల్హాపూర్లో జరిగిన భారీ బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ... "గతంలో రాజకీయ సమీకరణాలు చూసి మనం ఏక్ నాథ్ షిండే వర్గాన్ని 'శివసేన షిండే గ్రూప్' అని ప్రత్యేకంగా పిలవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మహారాష్ట్రలో అలాంటి గ్రూపుల ముచ్చటే లేదు. రాష్ట్రంలో ఉన్నది ఒకే ఒక్క ఒరిజినల్ శివసేన. అది పూర్తిగా షిండే నేతృత్వంలోనే నడుస్తోంది" అని అన్నారు.
సభకు ముందు అమిత్ షా కొల్హాపూర్లోని అత్యంత పవిత్రమైన మాతా అంబాబాయి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. మహారాష్ట్ర కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఆలయ ఆధునికీకరణ, ప్రత్యేక కారిడార్ నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ చేశారు.
ప్రధాని మోదీ ఇచ్చిన ‘అభివృద్ధి, వారసత్వం’ అనే నినాదంతోనే దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం సాధ్యమవుతోందని అమిత్ షా చెప్పారు. ఇందులో భాగంగానే మహారాష్ట్రలోని అన్ని జ్యోతిర్లింగాలు, శక్తి పీఠాలను ప్రభుత్వం అత్యంత వైభవంగా పునరుద్ధరిస్తోందని వెల్లడించారు.