శ్రీసిటీలో రైల్వే రోలింగ్ మిల్లు.. రష్యా దిగ్గజానికి లోకేష్ కీలక ప్రతిపాదనలు

Nara Lokesh proposes Russian giant to setup Railway Rolling Mill in Sri City
  • రష్యా పర్యటనలో నోవోస్టల్-ఎం చైర్మన్‌తో మంత్రి లోకేష్ సమావేశం
  • భారత్‌లో అత్యాధునిక ఈఏఎఫ్ స్టీల్ ప్లాంట్ నిర్మించాలని విజ్ఞప్తి
  • శ్రీసిటీలో రైల్వే ట్రాక్ రోలింగ్ మిల్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదన
  • ఆటోమోటివ్, షిప్‌బిల్డింగ్ పరిశ్రమలకు వైర్ ఫ్యాక్టరీ నిర్మాణంపై చర్చ
  • లోకేష్ ప్రతిపాదనలను పరిశీలిస్తామన్న నోవోస్టల్ చైర్మన్
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రష్యాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్, తన పర్యటనలో మూడో రోజు కీలక సమావేశం నిర్వహించారు. రష్యాకు చెందిన ప్రముఖ మెటలర్జికల్ హోల్డింగ్ కంపెనీ ‘నోవోస్టల్-ఎం’ చైర్మన్ ఇవాన్ డెమ్చెంకోతో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో భేటీ అయ్యారు. భారత్‌లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించి, పలు కీలక ప్రతిపాదనలు ఆయన ముందుంచారు.

భారత్‌లో ప్రస్తుతం పారిశ్రామిక వాతావరణం అత్యంత అనుకూలంగా ఉందని లోకేష్ తెలిపారు. పర్యావరణ అనుమతులు వేగంగా లభిస్తున్నాయని, మౌలిక సదుపాయాల మార్కెట్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని వివరించారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకుని, అత్యుత్తమ శ్రేణి రీబార్, వైర్ రాడ్‌లను తయారుచేసే అత్యాధునిక ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ (ఈఏఎఫ్) స్టీల్ ప్లాంట్‌ను భారత్‌లో నిర్మించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో తక్షణ రైల్వే సైడింగ్ కనెక్టివిటీతో కూడిన స్ట్రక్చరల్ సెక్షన్, రైల్వే ట్రాక్ రోలింగ్ మిల్లును ఏర్పాటు చేయాలని కోరారు. 

చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ పరిధిలోని ఆటోమోటివ్, షిప్‌బిల్డింగ్ పరిశ్రమలకు నేరుగా ముడిసరుకు అందించేందుకు ప్రత్యేకమైన హార్డ్‌వేర్ గాల్వనైజ్డ్ వైర్ ఫ్యాక్టరీని నిర్మించాలని సూచించారు. వీటితో పాటు, ముడి పదార్థాల లాజిస్టిక్స్ హబ్‌ను అభివృద్ధి చేయడానికి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలని, తక్కువ కర్బన ఉక్కు తయారీలో భాగస్వాములు కావాలని ప్రతిపాదించారు.

లోకేష్ ప్రతిపాదనలపై నోవోస్టల్-ఎం చైర్మన్ ఇవాన్ డెమ్చెంకో సానుకూలంగా స్పందించారు. తమ సంస్థ ఏటా 2.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేస్తూ, 60కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తోందని వివరించారు. తమ మార్కెట్ విస్తరణలో భాగంగా భారతదేశ నిర్మాణ, ఉత్పాదక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. 

ఇప్పటికే జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు ముడిసరుకు అందిస్తున్నామని, ముంబై, చెన్నై వంటి నగరాల్లో పంపిణీ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. మంత్రి లోకేష్ చేసిన ప్రతిపాదనలు ఆకర్షణీయంగా ఉన్నాయని, వాటన్నింటినీ తమ బోర్డుతో చర్చించి, క్షుణ్ణంగా పరిశీలిస్తామని డెమ్చెంకో హామీ ఇచ్చారు. ఈ భేటీతో ఏపీకి మరో భారీ పెట్టుబడి మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది.
Go Back to Shorts
Nara Lokesh
Russia Tour
Railway Rolling Mill
Sri City
TDP
Andhra Pradesh

More Telugu News