ఢిల్లీలో 15 లక్షల మందికి నిద్ర కరవు.. వణికిస్తున్న ‘ఓ-జోన్’ కూల్చివేతల నోటీసులు

 Delhis O Zone Panic 15 Million Homes Face Demolition Risk as DDA Intensifies Yamuna Floodplain Drive
  • ఢిల్లీ మాస్టర్ ప్లాన్ 2021 ప్రకారం యమునా నది పరీవాహక ప్రాంతం 'O-Zone'గా గుర్తింపు
  • వజీరాబాద్ నుంచి ఓఖ్లా వరకు విస్తరించి ఉన్న 94 అక్రమ కాలనీలు
  • హైకోర్టు, ఎన్‌జిటి ఆదేశాలతో రంగంలోకి ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ
  • యమునా బజార్‌లోని 310 కుటుంబాలకు డిజాస్టర్ మేనేజ్మెంట్ నోటీసులు
  • 2023, 2025 లలో వచ్చిన భారీ వరదలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం చర్యలు
ఢిల్లీలోని యమునా నది పరీవాహక ప్రాంతాన్ని (Floodplain) ఆనుకుని నివసిస్తున్న దాదాపు 15 లక్షల కుటుంబాల గుండెల్లో ఇప్పుడు 'O-Zone' (ఓ-జోన్) నిబంధనలు రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT), ఢిల్లీ హైకోర్టులు ఇచ్చిన వరుస ఆదేశాలతో అప్రమత్తమైన అధికారులు.. నది ఒడ్డున ఉన్న పర్యావరణ సున్నిత ప్రాంతాలను క్లియర్ చేయడానికి దేశ రాజధాని చరిత్రలోనే అతిపెద్ద కూల్చివేతల ప్రక్రియకు (Demolition Drive) సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఢిల్లీ మాస్టర్ ప్లాన్ 2021 కింద నివాస, వాణిజ్య నిర్మాణాలను పూర్తిగా నిషేధించిన 'ఓ-జోన్' పరిధిలోకి వచ్చే 94 కాలనీలను అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాలలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయడంతో స్థానిక నివాసితులలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

అసలు ఏమిటీ O-Zone?
వజీరాబాద్ నుంచి ఓఖ్లా వరకు దాదాపు 20 నుంచి 22 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న యమునా నది ఖాదర్ (వరద ముంపు) ప్రాంతాన్ని మాస్టర్ ప్లాన్ నిబంధనల ప్రకారం 'ఓ-జోన్'గా వర్గీకరించారు. ఇందులో జరోడా, సంగం విహార్, వజీరాబాద్, జగత్‌పూర్, నూర్ కాలనీ, దీపాన్షు కాలనీ, మిలన్ విహార్ వంటి 94 కాలనీలు ఉన్నాయి. ఈ జోన్‌ను అధికారులు గ్రీన్ జోన్, రెడ్ జోన్‌లుగా విభజించారు. యమునా నదిలో వరదలను నియంత్రించడం, పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్యం కాపాడటం, నదీ కాలుష్యాన్ని తగ్గించడమే ఈ జోన్ ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ఎలాంటి శాశ్వత లేదా తాత్కాలిక కట్టడాలు నిర్మించడం చట్టవిరుద్ధం.

ఈ క్రమంలోనే గడిచిన ఏప్రిల్ 30న డీడీఏ (DDA) ఒక బహిరంగ నోటీసు జారీ చేసింది. పీఎం-ఉదయ్ (PM-UDAY) పథకం కిందకు వచ్చే కాలనీలకు మినహా, మిగిలిన అన్ని అక్రమ నివాస, వాణిజ్య కట్టడాలను కూల్చివేస్తామని స్పష్టం చేసింది. ప్రజలంతా తమంతట తామే ఇళ్లను ఖాళీ చేసి వెళ్లాలని, లేనిపక్షంలో బలవంతంగా కూల్చివేస్తామని హెచ్చరించింది. బాధితులకు తాత్కాలిక వసతి కోసం బట్లా హౌస్, సరాయ్ కాలే ఖాన్ సమీపంలోని నైట్ షెల్టర్లలో ఏర్పాట్లు చేస్తున్నట్లు డీడీఏ పేర్కొంది.

మరోవైపు, మే 5వ తేదీన ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (DDMA) కూడా యమునా బజార్ పరిధిలోని 32 ఘాట్ల వద్ద నివసిస్తున్న సుమారు 310 కుటుంబాలకు విడిగా నోటీసులు జారీ చేసింది. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఈ ప్రాంతం పూర్తిగా నీట మునుగుతోందని, దీనివల్ల ప్రజల ప్రాణాలకు, పశువులకు, ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని డీడీఎంఏ పేర్కొంది.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2023, 2025 సంవత్సరాలలో యమునా నదికి వచ్చిన వరదల వల్ల ఇక్కడి ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ప్రతి ఏటా ఇక్కడ సహాయక చర్యలు (Rescue operations) చేపట్టడం, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాసం కల్పించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై, మానవ వనరులపై విపరీతమైన భారం పడుతోందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అయితే, డీడీఏ నోటీసులా కాకుండా, డీడీఎంఏ ఇచ్చిన నోటీసులలో ఎలాంటి పునరావాస ప్రణాళికను ప్రస్తావించకపోవడం స్థానిక 1,100 మందికి పైగా ఉన్న ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజా రక్షణ దృష్ట్యా యమునా నది పరివాహక ప్రాంతాన్ని ఆక్రమణలు లేకుండా ఉంచడం అత్యంత ఆవశ్యకమని, నిబంధనల ప్రకారం ఈ అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుందని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
Go Back to Shorts
Yamuna Floodplain Demolition
Delhi O-Zone Encroachments
DDA Anti-Encroachment Drive
Delhi Master Plan 2021
DDMA Yamuna Bazar Notice
National Green Tribunal (NGT) Orders

More Telugu News