తమిళనాడులో బీజేపీకి గట్టి షాక్.. పార్టీకి అన్నామలై రాజీనామా!
- జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్కు రాజీనామా లేఖ సమర్పణ
- పార్టీ పొత్తులు, అవకాశాలపై తీవ్ర అసంతృప్తి
- త్వరలో సొంతంగా రాజకీయ ఉద్యమం ప్రారంభించే అవకాశం
మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై, 2020లో బీజేపీలో చేరి అనతికాలంలోనే రాష్ట్రంలో కీలక నేతగా ఎదిగారు. అయితే, పార్టీలో తనకు సరైన అవకాశాలు లభించడం లేదని, ముఖ్యంగా 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పార్టీ అధిష్ఠానం ఆయనకు రాజ్యసభ సీటు ఆఫర్ చేసినప్పటికీ, దానిని ఆయన తిరస్కరించారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, బీజేపీ కూటమి పరిమిత స్థానాలకే పరిమితమైంది. ఈ ఫలితాల తర్వాత పార్టీ నాయకత్వంతో ఆయనకు విభేదాలు పెరిగాయి.
రాజీనామా అనంతరం అన్నామలై వెంటనే కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో లేరని, జాతీయవాద భావజాలంతో తొలుత ఒక ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించి, భవిష్యత్తులో దానిని రాజకీయ పార్టీగా మార్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జూన్ 4న ఆయన పుట్టినరోజు సందర్భంగా, చెన్నైలో ఆయన మద్దతుదారులు ఇప్పటికే భారీ పోస్టర్లు ఏర్పాటు చేశారు.