ఐపీఎల్ ఫైనల్: గుజరాత్ 155/8... ఆర్సీబీ ముందు ఈజీ టార్గెట్
- ఐపీఎల్ 2026 ఫైనల్లో ఆర్సీబీకి 156 పరుగుల లక్ష్యం
- తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 155/8
- ఒంటరి పోరాటంతో హాఫ్ సెంచరీ చేసిన వాషింగ్టన్ సుందర్
- మూడు వికెట్లతో గుజరాత్ను దెబ్బతీసిన రసిఖ్ సలాం దార్
- చెరో రెండు వికెట్లతో సత్తాచాటిన భువనేశ్వర్, హేజిల్వుడ్
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీకి బౌలర్లు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. పవర్ ప్లేలోనే గుజరాత్ ఓపెనర్లను పెవిలియన్కు పంపారు. ప్రమాదకర బ్యాటర్, కెప్టెన్ శుభ్మన్ గిల్ (10) హేజిల్వుడ్ బౌలింగ్లో ఔట్ కాగా, సాయి సుదర్శన్ (12) ను భువనేశ్వర్ కుమార్ వెనక్కి పంపాడు. దీంతో గుజరాత్ 26 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నిశాంత్ సింధు (20), జోస్ బట్లర్ (19) ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా, ఆర్సీబీ బౌలర్ల కట్టుదిట్టమైన బంతులకు వేగంగా ఆడలేకపోయారు. రసిఖ్ సలాం, కృనాల్ పాండ్య వీరిద్దరినీ ఔట్ చేయడంతో గుజరాత్ స్కోరు బోర్డు నెమ్మదించింది. అర్షద్ ఖాన్ (6 బంతుల్లో 15) రెండు సిక్సర్లతో మెరుపులు మెరిపించినా ఎక్కువసేపు నిలవలేదు.
ఒకవైపు వికెట్లు పడుతున్నా, వాషింగ్టన్ సుందర్ మాత్రం మరో ఎండ్లో ఒంటరి పోరాటం చేశాడు. చివరి వరకు క్రీజులో నిలిచి 37 బంతుల్లో 5 ఫోర్లతో 50 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని పోరాటం వల్లే గుజరాత్ 150 పరుగుల మార్కును దాటగలిగింది. ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ సలాం 4 ఓవర్లలో కేవలం 27 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి అత్యంత విజయవంతమైన బౌలర్గా నిలిచాడు. భువనేశ్వర్ కుమార్ (2/29) ఈ మ్యాచ్లో రెండు వికెట్లు తీసి, ఈ సీజన్లో మొత్తం 28 వికెట్లతో అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో సంయుక్తంగా అగ్రస్థానానికి చేరుకున్నాడు.
రెండో ఐపీఎల్ టైటిల్పై కన్నేసిన బెంగళూరు, ఛాంపియన్గా నిలవాలంటే 20 ఓవర్లలో 156 పరుగులు చేయాల్సి ఉంది.