సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు.. నటి రియా చక్రవర్తికి బిగ్ రిలీఫ్

Rhea Chakraborty Gets Big Relief in Sushant Singh Rajput Death Case
  • రియా చక్రవర్తి కుటుంబానికి ముంబై ప్రత్యేక కోర్టులో ఊరట
  • 2020 నుంచి ఫ్రీజ్ చేసిన వారి బ్యాంక్ ఖాతాలను విడుదల చేయాలని ఆదేశం
  • ఎన్‌డీపీఎస్ చట్టంలోని నిబంధనలను ఎన్‌సీబీ పాటించలేదన్న కోర్టు 
నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్, తల్లి సంధ్యకు ముంబైలోని ప్రత్యేక కోర్టులో భారీ ఊరట లభించింది. వారి బ్యాంక్ ఖాతాలను డీఫ్రీజ్ చేయాలని శనివారం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2020లో నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత నమోదైన డ్రగ్స్ కేసులో భాగంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) వారి ఖాతాలను స్తంభింపజేసిన విషయం తెలిసిందే.

గతంలో కొన్ని ఖాతాలపై నిషేధం తొలగించినప్పటికీ, ఐసీఐసీఐ, యాక్సిస్, కోటక్ బ్యాంకుల్లోని మరికొన్ని ఖాతాలను కూడా విడుదల చేయాలని రియా కుటుంబం తాజాగా పిటిషన్ దాఖలు చేసింది. ఎన్‌డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 68F ప్రకారం ఎన్‌సీబీ సరైన నిబంధనలు పాటించలేదని, కాబట్టి ఖాతాలను స్తంభింపజేయడం చట్టవిరుద్ధమని వారి తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ వాదనలపై ఎన్‌సీబీ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. రియా ఒక డ్రగ్ సిండికేట్‌లో చురుకైన సభ్యురాలని, అందుకే అధికారి ఖాతాలను ఫ్రీజ్ చేశారని తెలిపారు.

అయితే, ఇరుపక్షాల వాదనలు విన్న ప్రత్యేక న్యాయమూర్తి యు.సి.దేశ్‌ముఖ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్‌డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 68F(2) ప్రకారం ఏదైనా ఆస్తిని లేదా ఖాతాను ఫ్రీజ్ చేసిన 30 రోజుల్లోగా ‘కాంపిటెంట్ అథారిటీ’ నుంచి నిర్ధారణ ఉత్తర్వులు పొందాలని, కానీ ఈ విషయంలో ఎన్‌సీబీ ఆ నిబంధనను పాటించలేదని స్పష్టం చేశారు. ఎన్‌సీబీ ఈ వైఫల్యాన్ని అంగీకరించినందున, ఖాతాలను డీఫ్రీజ్ చేయాలన్న అభ్యర్థనను అనుమతిస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.  
Go Back to Shorts
Rhea Chakraborty
Sushant Singh Rajput
Rhea Chakraborty case
drugs case
Narcotics Control Bureau
NCB
Mumbai court
bank accounts defreezed
Showik Chakraborty
Sandeep Chakraborty

More Telugu News