ఎమ్మెల్యే తమ్ముడైనంత మాత్రాన పదవులు రావు: కోటంరెడ్డి
- నెల్లూరు రూరల్ లో రూ. 650 కోట్లతో అభివృద్ది పనులు జరుగుతున్నాయన్న కోటంరెడ్డి
- టీడీపీలో సామాన్యులకు కూడా ఉన్నత పదవులు దక్కుతాయని వ్యాఖ్య
- కష్టపడితో పార్టీలో గుర్తింపు ఉంటుందన్న కోటంరెడ్డి
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు రూ. 650 కోట్లతో భారీ ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. మనుమసిద్ది నగర్లో రూ. 2 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన ఈరోజు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రగతిపై తన ప్రణాళికను వివరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి సహకారంతోనే జిల్లాలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని కోటంరెడ్డి తెలిపారు. ఇప్పటికే కొన్ని పనులు పూర్తికాగా, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు.
తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్తలకు కూడా ఉన్నత పదవులు దక్కుతాయని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండానే, పార్టీ కోసం కష్టపడే వారిని గుర్తించి చంద్రబాబు, లోకేశ్ నేరుగా పదవులు ఇస్తున్నారని వెల్లడించారు. నాయకులు ఎప్పుడూ ప్రజల మధ్య ఉండి పనిచేయాలని హితవు పలికారు. "చెమట కారేలా కష్టం చేస్తేనే గుర్తింపు ఉంటుంది. కేవలం ఎమ్మెల్యే తమ్ముడిననో లేక సోగ్గా చొక్కాలు వేసుకుని తిరిగితేనో పదవులు రావు" అంటూ ఆయన స్వంత పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మారిటైమ్ బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ... కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పనితీరు తమకందరికీ ఆదర్శమని కొనియాడారు. సాధారణంగా ఒక నియోజకవర్గానికి ఒకరే ఎమ్మెల్యే ఉంటారని, కానీ రూరల్ ప్రజల కోసం కోటంరెడ్డి సోదరులిద్దరూ (శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి) ఎమ్మెల్యేల తరహాలో అంకితభావంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రం కోసం రోజుకు 18 గంటలు శ్రమిస్తున్నారని, అదే స్ఫూర్తితో తామంతా ఎన్నికల హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని సత్య స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత గిరిధర్ రెడ్డితో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.