చంద్రగిరిలో నారా రామ్మూర్తినాయుడు స్పోర్ట్స్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి లోకేశ్

Nara Lokesh Inaugurates Nara Ramamurthy Naidu Sports Center in Chandragiri
  • చంద్రగిరిలో క్రీడా సంబరం
  • సీఎం చదివిన బడిలో క్రీడా వికాస కేంద్రం
  • రూ.3.17 కోట్లతో క్రీడా కేంద్రం
  • మంత్రి లోకేశ్ చేతుల మీదుగా ప్రారంభం
  • పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌తో కలిసి బ్యాడ్మింటన్ ఆడిన లోకేశ్
తిరుపతి జిల్లా చంద్రగిరిలో క్రీడా సంబరం నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు, దివంగత నారా రామ్మూర్తినాయుడు స్మారకార్థం నిర్మించిన క్రీడా వికాస కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ బుధవారం ఘనంగా ప్రారంభించారు. చంద్రగిరి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ప్రారంభించిన లోకేశ్... ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌తో కలిసి కాసేపు బ్యాడ్మింటన్ ఆడి సందడి చేశారు.

కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి లోకేశ్ కు హాకీ క్రీడాకారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన నారా రామ్మూర్తినాయుడు మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రాంగణంలోని క్రీడా సౌకర్యాలను పరిశీలించారు. చిన్నారులతో టేబుల్ టెన్నిస్, హాకీ ఆడుతూ వారిలో ఉత్సాహం నింపారు. వారితో కలిసి ఫోటోలు దిగారు.

సీఎం చంద్రబాబు విద్యాభ్యాసం చేసిన చంద్రగిరి బాలుర ఉన్నత పాఠశాలలో రూ.3.17 కోట్ల వ్యయంతో ఈ క్రీడా వికాస కేంద్రాన్ని అభివృద్ధి చేశారు. జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించుకునేందుకు వీలుగా దీన్ని తీర్చిదిద్దారు. 2017లో నాటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ కేంద్రాన్ని మంజూరు చేయగా, గత ప్రభుత్వ హయాంలో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. తాజాగా ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ప్రత్యేక చొరవ తీసుకుని పనులు పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తెచ్చింది.

ఈ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, చెస్, స్కిప్పింగ్, యోగా, జిమ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. అలాగే అవుట్‌డోర్‌లో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బాల్ బ్యాడ్మింటన్ కోర్టులతో పాటు ప్రత్యేక హాకీ మైదానాన్ని కూడా సిద్ధం చేశారు. చంద్రగిరి, పరిసర ప్రాంతాల యువ క్రీడాకారుల శిక్షణ, అభివృద్ధికి ఈ కేంద్రం ఒక వేదికగా నిలుస్తుందని అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏపీ రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా ఇంఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, చిత్తూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు సి.షణ్ముగ రెడ్డి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, చంద్రగిరి నియోజకవర్గ పరిశీలకుడు డాక్టర్ శ్రీపతి బాబు, బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, దండు పూజ, భారత హాకీ క్రీడాకారిణి రజని ఇటిమరపు తదితరులు పాల్గొన్నారు.



Go Back to Shorts
Nara Lokesh
Nara Ramamurthy Naidu
Chandragiri
PV Sindhu
Kidambi Srikanth
Sports Development Center
Andhra Pradesh Sports
Telugu Desam Party
Indoor Stadium
AP Government

More Telugu News