ఉదయనిధి స్టాలిన్ ఆస్తులపై ఐటీ విచారణ.. మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశం

Udhayanidhi Stalin Assets IT Investigation Ordered by Madras High Court
  • ఉదయనిధి స్టాలిన్ ఆస్తుల అఫిడవిట్‌పై ఐటీ విచారణకు హైకోర్టు ఆదేశం
  • 2021, ప్రస్తుత అఫిడవిట్లలో వ్యత్యాసాలు ఉన్నాయని ఓటరు పిటిషన్
  • ఏప్రిల్ 20లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ఐటీ శాఖకు గడువు
  • పోలింగ్‌కు ముందే అభ్యర్థి ఆర్థిక వివరాలు తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉంద‌ని వ్యాఖ్య‌
  • ఈసీఐ పాత్ర, చట్టంలోని నిబంధనలపై కోర్టుకు వివరించిన న్యాయవాది
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ డీఎంకే కీలక నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల వివరాల్లో తీవ్రమైన వ్యత్యాసాలు ఉన్నాయన్న ఆరోపణలపై ప్రాథమిక విచారణ జరపాలని ఆదాయపు పన్ను (ఐటీ) శాఖను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ నెల 23న పోలింగ్ జరగనున్నందున, ఓటర్లకు అభ్యర్థుల ఆర్థిక విషయాలపై కచ్చితమైన సమాచారం తెలుసుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏప్రిల్ 20వ తేదీలోగా నివేదిక సమర్పించాలని ఐటీ శాఖ డైరెక్టర్ జనరల్‌కు గడువు విధించింది.

ఉదయనిధి స్టాలిన్ పోటీ చేస్తున్న చేపాక్-తిరువల్లికేణి నియోజకవర్గానికి చెందిన ఆర్. కుమార్వేల్ అనే వ్యక్తి ఈ పిల్ దాఖలు చేశారు. 2021 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్‌తో పోలిస్తే, ప్రస్తుత ఎన్నికల కోసం సమర్పించిన అఫిడవిట్‌లో అనేక తేడాలు ఉన్నాయని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వి. రాఘవాచారి కోర్టుకు వివరించారు. గతంలో ప్రకటించిన కొన్ని ఆస్తులు తాజా అఫిడవిట్‌లో కనిపించకపోవడం, అప్పుల లెక్కల్లో మార్పులు, ఆర్థిక లావాదేవీల వివరాల్లో పొంతన లేకపోవడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. ఇలాంటివి ఎన్నికల పారదర్శకతపై తీవ్ర ప్రభావం చూపుతాయని వాదించారు.

ఈ అంశంపై ఎన్నికల సంఘం (ఈసీఐ) తరఫు న్యాయవాది నిరంజన్ రాజగోపాలన్ వాదనలు వినిపిస్తూ, అభ్యర్థులు తమ ఆస్తుల వివరాలను నిజాయతీగా ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని తెలిపారు. అయితే, నామినేషన్ల స్క్రూటినీ సమయంలో ప్రతి అఫిడవిట్‌లోని నిజానిజాలను స్వయంగా నిర్ధారించే అధికారం రిటర్నింగ్ అధికారులకు ఉండదని, వారు కేవలం పరిశీలకులు మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 125ఏ ప్రకారం తప్పుడు వివరాలు ఇస్తే శిక్షలు ఉంటాయని, కానీ ఆ ప్రక్రియ ఎన్నికల తర్వాతే జరుగుతుందని వివరించారు.

అయితే, తమ ఉద్దేశం క్రిమినల్ చర్యలు తీసుకోవడం కాదని, పోలింగ్‌కు ముందే ఓటర్లకు వాస్తవాలు తెలియజేయడమేనని పిటిషనర్ తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. ఈ వాదనలతో ఏకీభవించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి, జస్టిస్ జి. అరుణ్ మురుగన్‌లతో కూడిన ధర్మాసనం, ఐటీ శాఖ నివేదిక కోసం కేసు విచారణను ఏప్రిల్ 20కి వాయిదా వేసింది.
Go Back to Shorts
Udhayanidhi Stalin
Udhayanidhi Stalin assets
Tamil Nadu elections
Madras High Court
IT investigation
election affidavit
DMK leader
Chepauk-Triplicane constituency
asset declaration discrepancies

More Telugu News