ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల.. 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఉత్తీర్ణత!
- ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్
- పరీక్షలకు హాజరైన మొత్తం 10.50 లక్షల మంది విద్యార్థులు
- ఫస్టియర్లో 77 శాతం.. సెకండియర్లో 81 శాతం మంది విద్యార్థుల పాస్
ఆంధ్రప్రదేశ్ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. గడిచిన 12 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారని మంత్రి వెల్లడించారు. ఈ ఏడాది కూడా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు.
ఈ ఏడాది సుమారు 10.50 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారని లోకేశ్ తెలిపారు. గత 12 ఏళ్లలో ఏన్నడూ లేనంతగా ఈ ఏడాది అత్యధిక శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. ఫస్టియర్లో 77 శాతం మంది విద్యార్థులు (3,61,526) పాసవ్వగా.. సెకండియర్లో 81 శాతం మంది విద్యార్థులు (3,59,816) ఉత్తీర్ణులైనట్లు వెల్లడించారు. ఫస్టియర్లో బాలురు 72 శాతం, బాలికలు 81 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్లో బాలురు 76 శాతం, బాలికలు 85 శాతం పాసయ్యారు. ఒకేషనల్ కోర్సులో ఫస్టియర్ లో 61%, సెకండియర్ లో 74% మంది పాసయ్యారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా తొలి ఏడాది 54 శాతం మంది, ద్వితీయ సంవత్సరం 68 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని లోకేశ్ కితాబునిచ్చారు. ఇది విద్యార్థులు, ప్రిన్సిపాల్స్, జూనియర్ లెక్చరర్ల కష్టానికి ఫలితమని కొనియాడారు.
ఫలితాలను చెక్ చేసుకునే విధానం:
వెబ్సైట్: విద్యార్థులు resultsbie.ap.gov.in లో తమ హాల్ టికెట్ నంబర్ ద్వారా ఫలితాలు పొందవచ్చు.
వాట్సప్: 9552300009 నంబర్కు 'Hi' అని మెసేజ్ పంపి, హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే నేరుగా రిజల్ట్ వాట్సప్కే వస్తుంది.
ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులు నిరాశ చెందవద్దని, సప్లిమెంటరీ పరీక్షల్లో పట్టుదలతో చదివి పాస్ కావాలని సూచించారు. ఈ సమయంలో తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు మానసిక మద్దతునివ్వాలని విజ్ఞప్తి చేశారు.