Narayana AP Minister: అమరావతిపై జగన్ మాట మార్చారు: నారాయణ
అసెంబ్లీ సాక్షిగా అమరావతినే రాజధానిగా అంగీకరించిన జగన్... అధికారంలోకి వచ్చాక మాట మార్చి 'మూడు రాజధానుల' పేరుతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించారని మంత్రి నారాయణ మండిపడ్డారు. చంద్రబాబు నాయకత్వంపై నమ్మకంతో అమరావతి కోసం రైతులు 34 వేల ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చారని, కానీ గత ప్రభుత్వం వారి ఆశయాలను కాలరాసిందని విమర్శించారు. శివరామకృష్ణ కమిటీ రాజధాని ఎంపికను రాష్ట్రానికే వదిలేసిందని, దాని ఆధారంగానే అమరావతిని ఎంపిక చేశామని గుర్తుచేశారు.
గతంలోనే రూ. 41,170 కోట్లతో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించినా, వైసీపీ ప్రభుత్వం వాటిని నిలిపివేసి రాష్ట్రానికి నష్టం చేకూర్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమరావతిని 9 ప్రత్యేక నగరాలు (జస్టిస్, మీడియా, హెల్త్ సిటీ వంటివి), 23 టౌన్షిప్లతో ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. నిలిచిపోయిన భవనాల నాణ్యతను పరిశీలించి, పనులను అత్యంత వేగంగా పూర్తి చేస్తామని నారాయణ స్పష్టం చేశారు.