Nara Lokesh: విశాఖలో 20 వేల ఉద్యోగాలు.. క్యాప్‌జెమినీకి మంత్రి లోకేశ్‌ కీలక ప్రతిపాదన

Nara Lokesh Proposes 20000 Jobs in Vizag to Capgemini
  • విశాఖలో క్యాప్‌జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్‌తో మంత్రి నారా లోకేశ్‌ భేటీ
  • 20 వేల ఉద్యోగాల సామర్థ్యంతో డెవలప్‌మెంట్ సెంటర్, జీసీసీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
  • విశాఖ ఐటీ ఎకోసిస్టమ్, భోగాపురం ఎయిర్‌పోర్ట్ వంటి అనుకూలతలను వివరించిన లోకేశ్‌
  • ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చిన క్యాప్‌జెమినీ సీఈవో
  • రాష్ట్రంలో క్వాంటం వ్యాలీ, ఎమర్జింగ్ టెక్నాలజీ ల్యాబ్స్ ఏర్పాటుకూ ప్రతిపాదన
ఏపీలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా, ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ క్యాప్‌జెమినీని రాష్ట్రానికి ఆహ్వానించింది. విశాఖపట్నంలో క్యాప్‌జెమినీ గ్లోబల్ సీఈవో ఐమాన్ ఇజ్జత్‌తో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్‌ సమావేశమై కీలక చర్చలు జరిపారు. సుమారు 20 వేల మందికి ఉద్యోగాలు కల్పించే సామర్థ్యంతో విశాఖలో ఒక భారీ ఐటీ డెవలప్‌మెంట్ సెంటర్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా లోకేశ్ ప్రతిపాదించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతతో విశాఖపట్నం ఐటీ, డేటా సెంటర్ హబ్‌గా శరవేగంగా అభివృద్ధి చెందుతోందని లోకేశ్‌ వివరించారు. దేశంలోనే అతిపెద్దదైన గూగుల్ డేటా సెంటర్ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని, ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. మరో మూడు నెలల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుండటంతో విశాఖకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని అన్నారు. ఇక్కడ ఉన్న ప్రత్యేక ఐటీ ఎకోసిస్టమ్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అంతేకాకుండా, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలతో కలిసి ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్‌పై ల్యాబ్‌లు ఏర్పాటు చేసేందుకు కో-డెవలప్‌మెంట్ పార్టనర్‌గా వ్యవహరించాలని లోకేశ్ కోరారు. ఏపీలో 'క్వాంటం వ్యాలీ' అభివృద్ధికి, డెడికేటెడ్ క్వాంటం వర్టికల్ స్థాపనకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

మంత్రి లోకేశ్‌ ప్రతిపాదన.. క్యాప్‌జెమినీ సీఈవో సానుకూల స్పందన‌
మంత్రి లోకేశ్‌ ప్రతిపాదనలపై క్యాప్‌జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్ సానుకూలంగా స్పందించారు. పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 3.4 లక్షల మంది ఉద్యోగులు ఉండగా, వారిలో 2 లక్షల మంది భారత్‌లోనే ఉన్నారని తెలిపారు. భారత్‌లోని 13 నగరాల్లో తమ కార్యకలాపాలు విస్తరించి ఉన్నాయని వివరిస్తూ, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను తప్పకుండా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో క్యాప్‌జెమినీ ఇండియా సీఈవో సంజయ్ చాకే, డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సీఈవో కేశవ్ మురుగేశ్‌ కూడా పాల్గొన్నారు. క్యాప్‌జెమినీ సంస్థ వార్షికాదాయం సుమారు 23.9 బిలియన్ డాల‌ర్లు కావడం గమనార్హం.

Nara Lokesh
Capgemini
Visakhapatnam
AP IT Development
Aiman Ezzat
IT Hub
Andhra Pradesh Investments
Global Capability Center
BhogaPuram Airport
Keshav Murugesh

More Telugu News