Indian Railways: విజయవాడ-విశాఖ మధ్య బుల్లెట్ రైలు.. రైల్వే శాఖ కీలక ప్రతిపాదన

Indian Railways Proposes Vijayawada Visakhapatnam Bullet Train
  • విజయవాడ-కర్నూలు మధ్య సెమీ హైస్పీడ్ కారిడార్
  • సర్వే కోసం రైల్వే బోర్డుకు చేరిన ప్రతిపాదనలు
  • రాష్ట్రంలో పలు కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుకు ప్రణాళికలు
  • శ్రీశైలానికి రైలు మార్గం ఏర్పాటుపైనా దృష్టి
ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసే దిశగా రైల్వే శాఖ కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్రంలోని రెండు ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నం మధ్య బుల్లెట్ రైలు నడిపేందుకు హైస్పీడ్ కారిడార్‌ను, మరోవైపు విజయవాడ నుంచి కర్నూలుకు సెమీ హైస్పీడ్ కారిడార్‌ను నిర్మించాలని పరిశీలిస్తోంది. వీటితో పాటు రాష్ట్రంలో మరో ఆరు కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రాజెక్టులన్నింటికీ ఫైనల్ లొకేషన్ సర్వే (FLS) చేసేందుకు అనుమతి కోరుతూ అధికారులు రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపారు. బోర్డు నుంచి ఆమోదం లభిస్తే ఈ పనుల్లో ముందడుగు పడుతుంది.

విజయవాడ-విశాఖపట్నం మధ్య దాదాపు 350 కిలోమీటర్ల మేర ఈ హైస్పీడ్ రైల్ కారిడార్‌ను నిర్మించాలని భావిస్తున్నారు. ఇది కార్యరూపం దాల్చితే గంటకు 320 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో బుల్లెట్ రైళ్లు పరుగులు పెడతాయి. ఏలూరు, రాజమహేంద్రవరం, కాకినాడ మీదుగా ఈ మార్గాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రం మీదుగా మూడు హైస్పీడ్ కారిడార్లకు ప్రతిపాదనలు ఉండగా, ఇది నాలుగోది కానుంది.

ప్రస్తుతం విజయవాడ నుంచి కర్నూలుకు నేరుగా రైలు సౌకర్యం లేదు. ఈ నేపథ్యంలో రెండు నగరాల మధ్య 350 కిలోమీటర్ల మేర సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మించాలని రైల్వేశాఖ ప్రతిపాదించింది. గుంటూరు, నరసరావుపేట, మార్కాపురం, నంద్యాల మీదుగా ఈ లైన్‌ను నిర్మించనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే గంటకు 220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ, కేవలం 2 గంటల్లోనే విజయవాడ నుంచి కర్నూలుకు చేరుకునే అవకాశం ఉంటుంది.

వీటితో పాటు పల్నాడు జిల్లా మాచర్ల నుంచి తెలంగాణలోని గద్వాల్ వరకు (184 కి.మీ.), నెల్లూరు నుంచి రాజంపేటకు (120 కి.మీ.) నేరుగా కొత్త లైన్లు వేయాలని ప్రతిపాదించారు. ముఖ్యంగా, ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి రైలు సౌకర్యం కల్పించేందుకు హైదరాబాద్ నుంచి శ్రీశైలం మీదుగా మార్కాపురం వరకు కొత్త రైలు మార్గాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఈ ప్రతిపాదనలన్నింటికీ రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇస్తే సర్వే పనులు ప్రారంభం కానున్నాయి.
Indian Railways
Vijayawada
Visakhapatnam
Andhra Pradesh
Bullet Train
High Speed Rail Corridor
Semi High Speed Rail
Kurnool
New Railway Lines
Railway Board

More Telugu News