Chandrababu Naidu: ప్రజల్లో 90 శాతం సంతృప్తి ఉండాల్సిందే: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Focuses on 90 Percent Public Satisfaction
  • ప్రజల్లో ప్రభుత్వ పనితీరుపై 80-90 శాతం సంతృప్తి ఉండాలన్న సీఎం
  • దీపం పథకం గ్యాస్ డెలివరీకి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు
  • రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్టాండ్లలో టాయిలెట్స్ మరమ్మతులకు ఆదేశం
  • బాణసంచా ప్రమాదాల నివారణపై శివకాశీ వెళ్లి అధ్యయనం చేయాలని సూచన
  • రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవినీతికి తావులేని అధికారులకే బాధ్యతలు
రాష్ట్రంలో ప్రభుత్వ పాలన, వివిధ శాఖల పనితీరుపై ప్రజల్లో సానుకూల దృక్పథం (పాజిటివ్ పర్షెప్సన్) పెరిగేలా అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్, పబ్లిక్ పర్సెప్షన్‌పై సోమవారం ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ నెల నుంచి ప్రభుత్వ సేవలపై ప్రజల సంతృప్తి స్థాయి కనీసం 80 నుంచి 90 శాతానికి తగ్గకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

ప్రజా సంక్షేమ పథకాల అమలులో అలసత్వం వహించకూడదని సీఎం హెచ్చరించారు. ముఖ్యంగా పెన్షన్ల పంపిణీలో ఇంకా లోటుపాట్లు ఉన్న 'స్వర్ణ' గ్రామాలు, వార్డులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అట్టడుగు స్థానంలో ఉన్న ప్రాంతాల్లో కూడా పంపిణీ సమర్థంగా జరగాలన్నారు. అలాగే, దీపం పథకం కింద అందిస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల డెలివరీకి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రజారవాణాపై సమీక్షిస్తూ.. ఆర్టీసీ బస్సు సర్వీసులు బాగానే ఉన్నప్పటికీ, బస్టాండ్లలో మౌలిక వసతులు అంతంతమాత్రంగానే ఉన్నాయని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా పుంగనూరు, వెంకటగిరి, పెనుకొండ, ప్రొద్దుటూరు, ఎమ్మిగనూరు, శ్రీకాళహస్తి బస్టాండ్లలో తాగునీరు, టాయిలెట్స్, ఫ్యాన్స్, సీటింగ్ ఏర్పాట్లపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని ప్రస్తావించారు. ప్రయాణికుడు బస్టాండ్‌కు వచ్చిన దగ్గరి నుంచి గమ్యస్థానం చేరేవరకూ ప్రయాణం సౌకర్యవంతంగా ఉండాలని, రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లలో టాయిలెట్ల మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో వరుస ప్రమాదాల నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. బాణసంచా పేలుడు ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలో తెలుసుకునేందుకు తమిళనాడులోని శివకాశీకి వెళ్లి అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.

రిజిస్ట్రేషన్ శాఖ పనితీరుపై చర్చిస్తూ... స్లాట్ బుకింగ్, డిజిటల్ సేవలపై ప్రజల్లో సంతృప్తి ఉందని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం, అవినీతికి ఆస్కారం లేకుండా రాష్ట్రంలోని మొత్తం 295 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిజాయతీ కలిగిన అధికారులకే బాధ్యతలు ఇవ్వాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి 'వాట్సాప్ మనమిత్ర' సేవలను నూటికి నూరు శాతం వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అన్ని శాఖల పనితీరు మెరుగుపరుచుకునేందుకు అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

Chandrababu Naidu
Andhra Pradesh
government schemes
public satisfaction
RTC bus services
bus stands
firecracker accidents
registration department
WhatsApp Mana Mitra
public perception

More Telugu News