AP Postal Services: ఏపీలో 24 గంటల పోస్టల్ సేవలు.. ఇక రాత్రిపూట కూడా పార్శిల్ బుకింగ్

AP Postal Services Now Available 24 Hours in Key Cities
  • ఏపీలోని 11 నగరాల్లో 24 గంటల స్పీడ్ పోస్ట్, పార్శిల్ బుకింగ్
  • రాత్రింబవళ్లు అందుబాటులోకి వచ్చిన తపాలా సేవలు
  • 242 ప్రధాన తపాలా కార్యాలయాల్లో 1 నుంచి 2 గంటల పనివేళల పెంపు
  • సాంకేతిక ఆధునికీకరణతో మరింత విస్తృతమవుతున్న పోస్టల్ సేవలు
ఏపీ ప్రజలకు తపాలా శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రధాన నగరాల్లో ఇకపై 24 గంటలూ స్పీడ్ పోస్ట్, పార్శిల్ బుకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నిర్ణయంతో రాత్రింబవళ్లు ఎప్పుడైనా పోస్టల్ సేవలను వినియోగించుకునే వెసులుబాటు ప్రజలకు కలిగింది.

తొలి దశలో భాగంగా రాష్ట్రంలోని 11 ముఖ్య నగరాల్లో ఈ 24/7 సౌకర్యాన్ని ప్రారంభించారు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలు, గుంతకల్లు ప్రధాన తపాలా కార్యాలయాల్లో ఈ సేవలు నిరంతరం అందుబాటులో ఉంటాయి. దీంతో అత్యవసరంగా పత్రాలు, వస్తువులు పంపాలనుకునే వారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది.

కేవలం 24 గంటల సేవలే కాకుండా, మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్లు తపాలా శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని 242 ప్రధాన పట్టణాల్లో ఉన్న పోస్టాఫీసుల పనివేళలను 1 నుంచి 2 గంటల పాటు పెంచినట్లు అధికారులు వివరించారు. ఇటీవలే ఐటీ 2.0 సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానం చేయడంతో పోస్టల్ సేవలు మరింత స్మార్ట్‌గా మారాయని, ఈ ఆధునికీకరణలో భాగంగానే తాజాగా ఈ సౌకర్యాలను విస్తరించినట్లు వారు పేర్కొన్నారు.
AP Postal Services
Andhra Pradesh Postal Department
24/7 Postal Service
Speed Post Booking
Parcel Booking
Visakhapatnam
Vijayawada
Tirupati
Post Office Timings
IT 2.0 Software

More Telugu News