Botsa Satyanarayana: డిజిటల్ అటెండెన్స్ శాసనమండలిలో ఎందుకు లేదు?: బొత్స సత్యనారాయణ
- మండలిలో డిజిటల్ అటెండెన్స్ లేకపోవడంపై ప్రభుత్వం స్పష్టతను ఇవ్వాలన్న బొత్స
- తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారనడం బాధాకరమని వ్యాఖ్య
- టాయిలెట్లలో వాడే కెమికల్స్ కలిపారనడం దురదృష్టకరమన్న బొత్స
శాసనసభలో డిజిటల్ అటెండెన్స్ వ్యవస్థను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యవస్థను శాసనమండలిలో ఎందుకు అమలు చేయడం లేదని వైసీపీ సభ్యుడు బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. మండలి మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ... ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టతను ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తిరుమల లడ్డూ ప్రసాదంలో పందికొవ్వు, జంతువుల కొవ్వు కలిపారని ప్రచారం చేయడం బాధాకరమని అన్నారు. వాస్తవాలు తేలాలని సుప్రీంకోర్టు సిట్ నియమించిందని చెప్పారు. దర్యాప్తులో కొన్ని ఆశ్చర్యకర విషయాలు, ప్రజలు జీర్ణించుకోలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. టాయిలెట్లలో వాడే కెమికల్స్ లడ్డూలో కలిపారని సీఎం మాట్లాడటం దురదృష్టకరమని, చంద్రబాబు అధికార దాహంతో ఏ స్థాయికైనా వెళతారని బొత్స విమర్శించారు. చంద్రబాబు దోపిడీపై ఎంతవరకైనా పోరాడతామని స్పష్టం చేశారు.