Bill Gates: ఏపీలో టెక్ పాలన అమోఘం... సోషల్ మీడియాలోనూ ఆశ్చర్యం వ్యక్తం చేసిన బిల్ గేట్స్!

Bill Gates Impressed with Andhra Pradesh Tech Governance
  • నిన్న ఏపీలో పర్యటించిన బిల్ గేట్స్
  • సీఎం చంద్రబాబుతో కలిసి ఆర్టీజీఎస్ సందర్శన
  • పాలనలో, అభివృద్ధిలో టెక్నాలజీ వినియోగాన్ని చూసి ఆశ్చర్యపోయిన గేట్స్
కృత్రిమ మేధ (ఏఐ), టెక్నాలజీ వినియోగంతో ఆంధ్రప్రదేశ్ సాధిస్తున్న అభివృద్ధిని చూడటం ఎంతో ఉత్సాహంగా అనిపించిందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో తనకు ఘన స్వాగతం పలికినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన చంద్రబాబు చేసిన ట్వీట్ ను ఎక్స్ ఖాతాలో రీపోస్ట్ చేశారు.

నిన్న (ఫిబ్రవరి 16న) బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, ఇతర మంత్రులు ఆయనకు స్వాగతం పలకగా, అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆహ్వానించారు. అనంతరం చంద్రబాబుతో కలిసి ఆయన రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ (RTGS) కేంద్రాన్ని సందర్శించి, దాని పనితీరును అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆరోగ్యం, వ్యవసాయం, విద్య వంటి రంగాల్లో సాంకేతికత, ఏఐ ఆధారిత ఆవిష్కరణల వినియోగంపై ఇరువురు నేతలు చర్చించారు. 1990లలో గేట్స్‌తో జరిగిన తొలి సమావేశమే తనకు స్ఫూర్తినిచ్చిందని, ఇప్పుడు ఏపీలో టెక్నాలజీతో సాగుతున్న పాలనను ఆయనకు చూపించడం సంతోషంగా ఉందని చంద్రబాబు ఎక్స్ వేదికగా తెలిపారు.

ఈ పర్యటనలో భాగంగా గేట్స్ ఉండవల్లిలో అరటి తోటను సందర్శించి, సహజ వ్యవసాయ పద్ధతులను పరిశీలించారు. ఢిల్లీలో జరగనున్న ఏఐ సమ్మిట్‌కు వెళ్లే ముందు ఆయన ఏపీకి వచ్చారు. ఈ పర్యటనతో రాష్ట్రంలో ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో పలు ప్రాజెక్టులకు మద్దతిస్తున్న గేట్స్ ఫౌండేషన్‌తో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం మరింత బలోపేతం కానుంది.
Bill Gates
Andhra Pradesh
Chandrababu Naidu
Nara Lokesh
Artificial Intelligence
AI Summit
Real Time Governance System
RTGS
Agriculture
Technology
Bill and Melinda Gates Foundation

More Telugu News