ప్రియుడితో మహిళ గోవా ట్రిప్.. హోటల్ సిబ్బంది బ్లాక్ మెయిల్

Hyderabad Woman Blackmailed After Goa Trip with Boyfriend
  • రెండేళ్ల క్రితం గోవా వెళ్లిన హైదరాబాదీ మహిళ
  • హోటల్ లో ప్రియుడితో సన్నిహితంగా ఉన్నపుడు వీడియో తీసిన హోటల్ స్టాఫ్
  • ఆ వీడియోలు పంపించి రూ.30 లక్షలు డిమాండ్ చేస్తున్న వైనం
  • పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు..
వివాహానికి ముందు ప్రియుడితో కలిసి గోవాలో పర్యటించిందో మహిళ.. అప్పుడు హోటల్ గదిలో ప్రియుడితో సన్నిహితంగా ఉండగా వీడియో తీసిన హోటల్ స్టాఫ్.. ఆ వీడియోలతో ఇప్పుడు బ్లాక్ మెయిల్ కు దిగాడు. 30 లక్షలు ఇస్తే సరి లేదంటే ఆ వీడియోలను ఆన్ లైన్ లో పెడతానంటూ బెదిరింపులకు దిగాడు. రెండేళ్ల క్రితం అదీ పెళ్లి కాకముందు జరిగిన విషయాన్ని ఇప్పుడు బయటపెడితే తన కాపురం కూలిపోతుందని వేడుకున్నా వినలేదు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

హైదరాబాద్ లోని ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన ఓ మహిళ 2023లో గోవాలో పర్యటించింది. తన ప్రియుడితో కలిసి సరదాగా గడిపింది. అక్కడ వారు బస చేసిన హోటల్ లో ప్రియుడితో సన్నిహితంగా గడిపిన సమయంలో హోటల్ సిబ్బంది రహస్యంగా వీడియో తీశారు. ఇదేమీ తెలియని బాధితురాలు తిరిగొచ్చాక గోవా టూర్ విషయమే మరిచిపోయింది. మరో వ్యక్తిని వివాహం చేసుకుని కాపురం చేసుకుంటోంది. అయితే, గోవాలో వారికి బస, ఇతర ఏర్పాట్లు చేసిన యశ్వంత్ అనే వ్యక్తి ఇటీవల మహిళకు ఫోన్ చేశాడు.

గతంలో మీరు సన్నిహితంగా ఉన్న వీడియోలు తన వద్ద ఉన్నాయని, రూ.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బు ఇస్తే వాటిని డిలీట్ చేస్తానని లేదంటే ఆన్ లైన్ లో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. అంత డబ్బు తన వద్ద లేదని, ఆ వీడియోలు బయటపడితే తన కాపురం కూలిపోతుందని బాధితురాలు ప్రాధేయపడింది. వాటిని డిలీట్ చేయాలని కోరింది. అయితే, యశ్వంత్ వినిపించుకోకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యశ్వంత్ ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
Advertisement
Goa Trip Blackmail
Goa
Blackmail
Hyderabad
Yashwanth
Hotel Staff
Extortion
Cyber Crime
Privacy Violation

More Telugu News