KTR: కేటీఆర్ కార్ల వివాదం: బండి సంజయ్‌పై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్

KTR Luxury Car Allegations Jagadish Reddy Slams Bandi Sanjay
షార్ట్స్‌లో చూడండి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వినియోగిస్తున్న లగ్జరీ కార్లపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సంజయ్ వ్యాఖ్యలను "చిల్లర మాటలు" అంటూ కొట్టిపారేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బండి సంజయ్ తన కార్లను ఏ షోరూంలో కొనుగోలు చేశారో, కేటీఆర్ కూడా అదే షోరూం నుంచే కొన్నారని స్పష్టం చేశారు.

"సెకండ్ హ్యాండ్ కార్లను ఎవరైనా కొంటారు, ఇదేనా బండి సంజయ్ గొప్పగా కనిపెట్టిన విషయం?" అని జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ వివాదంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే సందర్భంగా ఆయన రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపైనా విమర్శలు చేశారు. కృష్ణా జలాల వాటాపై చర్చకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని ఆయన పునరుద్ఘాటించారు.

అంతకుముందు, బండి సంజయ్ సోషల్ మీడియా వేదికగా కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని పలు ప్రశ్నలు సంధించారు. లగ్జరీ కార్ల స్కామ్‌లో నిందితుడిగా ఉన్న బషరత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూయిజర్ కార్లలో కేటీఆర్ ఎందుకు తిరుగుతున్నారని ఆయన నిలదీశారు. ఆ కార్లను కేసీఆర్ కుటుంబానికి చెందిన కంపెనీల పేర్ల మీద ఎందుకు రిజిస్ట్రేషన్ చేశారని ప్రశ్నించారు.

వాటిని మార్కెట్ ధరకు కొన్నారా లేక తక్కువ ధరకు చూపించారా? చెల్లింపులు బినామీల ద్వారా జరిగాయా లేక మనీలాండరింగ్ జరిగిందా? అనే కోణంలో విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. బండి సంజయ్ చేసిన ఈ ఆరోపణలకు జగదీశ్ రెడ్డి ఘాటుగా బదులివ్వడంతో తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Go Back to Shorts
KTR
K Taraka Rama Rao
Bandi Sanjay
Jagadish Reddy
BRS party
Luxury cars controversy
Telangana politics
KCR
Krishna River waters
Basharat Khan

More Telugu News