Atique Ahmed: అతీక్ అహ్మద్ ఎన్‌కౌంటర్.. యోగి పాలనపై ఎస్పీ మహిళా ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా ప్రశంసలు

Atique Ahmed Encounter SP MLA praises Yogi governance in Assembly
షార్ట్స్‌లో చూడండి
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఒక అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యే పూజా పాల్  ప్రశంసల వర్షం కురిపించారు. మాఫియా నేతగా మారిన అతిక్ అహ్మద్‌పై యోగి ప్రభుత్వం అనుసరించిన కఠిన వైఖరిని ఆమె అభినందించారు. తన భర్త హత్య కేసులో నిందితుడైన అతిక్‌ను యోగి ప్రభుత్వం మట్టిలో కలిపిందని ఆమె భావోద్వేగంతో వ్యాఖ్యానించారు.

యూపీ అసెంబ్లీలో 'విజన్ డాక్యుమెంట్ 2047'పై జరిగిన సుదీర్ఘ చర్చ సందర్భంగా ఎస్పీ ఎమ్మెల్యే పూజా పాల్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. "నా భర్తను ఎవరు, ఎలా హత్య చేశారో అందరికీ తెలుసు. నన్ను ఎవరూ పట్టించుకోని సమయంలో ముఖ్యమంత్రి నా మాట విన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో నాలాంటి ఎందరో మహిళలకు ఆయన న్యాయం చేశారు. నేరస్థులను శిక్షించారు" అని పూజా పాల్ పేర్కొన్నారు.

"నా భర్త హంతకుడైన అతిక్ అహ్మద్‌ను ముఖ్యమంత్రి మట్టిలో కలిపే పని చేశారు. ఈ న్యాయపోరాటంలో నేను అలసిపోతున్న తరుణంలో ముఖ్యమంత్రి యోగి నాకు న్యాయం చేశారు. ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యమంత్రి వైపు ఎంతో విశ్వాసంతో చూస్తున్నారు" అని ఆమె అన్నారు.

ఏమిటీ కేసు?

2005 జనవరిలో బీఎస్పీ ఎమ్మెల్యేగా ఉన్న రాజు పాల్‌ను కొందరు దుండగులు కాల్చి చంపారు. ఆయనకు పూజా పాల్‌తో వివాహమైన 9 రోజులకే ఈ దారుణం జరిగింది. అలహాబాద్ వెస్ట్ నియోజకవర్గ ఉప ఎన్నికలో అతిక్ అహ్మద్ సోదరుడు అష్రఫ్ అహ్మద్‌పై రాజు పాల్ గెలుపొందారు. ఈ హత్య కేసులో అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ ప్రధాన నిందితులుగా ఉన్నారు. వేరే కేసులో దోషులుగా తేలిన వీరిద్దరూ ఏప్రిల్ 2023లో పోలీస్ కస్టడీలో ఉండగానే హత్యకు గురైన విషయం తెలిసిందే.

రాష్ట్రంలో మాఫియాపై తమ ప్రభుత్వం 'జీరో టాలరెన్స్' విధానాన్ని అనుసరిస్తోందని, అనేకమంది నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకున్నామని సీఎం యోగి ఆదిత్యనాథ్ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యే నుంచే ప్రశంసలు రావడం ఈ విధానానికి మద్దతుగా నిలుస్తోంది.
Go Back to Shorts
Atique Ahmed
Atique Ahmed encounter
Yogi Adityanath
Pooja Pal
Raju Pal murder case

More Telugu News