Advertisement

గిరిజన పాఠశాలలకు పక్కా భవనాలు.. ప్రభుత్వ బడులకు పూర్వ వైభవం: మంత్రి లోకేశ్‌

Nara Lokesh promises permanent buildings for tribal schools and revival of government schools
  • వచ్చే ఏడాది నాటికి గిరిజన ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పక్కా భవనాలు
  • ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోకి 1.10 లక్షల మంది విద్యార్థులు చేరారన్న మంత్రి
  • తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఆర్థిక సాయం
  • మెగా డీఎస్సీ ద్వారా 16 వేల టీచర్ పోస్టుల భర్తీ పూర్తి చేశామని వెల్లడి
  • విలువలతో కూడిన విద్య అందించడమే లక్ష్యమని స్పష్టం చేసిన మంత్రి లోకేశ్‌
వచ్చే ఏడాదిలోగా రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో సొంత భవనాలు లేని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మిస్తామని, శిథిలావస్థలో ఉన్నవాటిని ఆధునికీకరిస్తామని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజల్లో పెరిగిన విశ్వాసంతో ఈ ఏడాది 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ బడుల్లో చేరారని, ఇది రెండేళ్ల తమ ప్రభుత్వ కృషికి నిదర్శనమని ఆయన అన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఆయన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ, విద్యా వ్యవస్థలో చేపట్టిన సంస్కరణల ఫలాలను వివరించారు.

"మనందరి రెండేళ్ల కృషి ఫలించింది. చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలల ముందు 'నో అడ్మిషన్' బోర్డులు చూస్తున్నాం. ఇది ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థుల సమష్టి విజయం. వారే ప్రభుత్వ పాఠశాలలకు నిజమైన బ్రాండ్ అంబాసిడర్లు" అని లోకేశ్‌ అన్నారు. తన నియోజకవర్గమైన మంగళగిరిలో ఒక తల్లి తన బిడ్డకు ప్రభుత్వ పాఠశాలలో సీటు ఇప్పించాలని అడగడం తనను ఆశ్చర్యపరిచిందని, ప్రభుత్వ బడుల్లో సీట్లకు డిమాండ్ పెరగడం ఉపాధ్యాయుల కఠోరశ్రమకు నిదర్శనమని కొనియాడారు.

విద్యా వ్యవస్థలో సంస్కరణల వెల్లువ
విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొస్తానని ముఖ్యమంత్రికి హామీ ఇచ్చానని, ఆ మాట నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నామని లోకేశ్‌ తెలిపారు. ఇందులో భాగంగానే 'తల్లికి వందనం' పథకాన్ని గత ప్రభుత్వానికి భిన్నంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికీ వర్తింపజేస్తున్నామని స్పష్టం చేశారు. 

2025లో 67.27 లక్షల మంది విద్యార్థులకు రూ. 10,090 కోట్లు, 2026లో 67.47 లక్షల మందికి రూ. 10,120 కోట్లు అందించామని గణాంకాలతో సహా వివరించారు. మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, పారదర్శకమైన టీచర్ ట్రాన్స్‌ఫర్ యాక్ట్ తీసుకొచ్చామని తెలిపారు.

డొక్కా సీతమ్మ పేరుతో ప్రాంతీయ రుచులకు అనుగుణంగా మెనూతో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నామని, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ కిచెన్‌లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో విద్యార్థులకు కిట్స్ అందిస్తున్నామని, విద్యార్థుల సమగ్ర వికాసం కోసం శనివారాల్లో 'నో బ్యాగ్ డే' అమలు చేస్తున్నామని వివరించారు. ఇంటర్ విద్యార్థులకు కూడా స్టూడెంట్ కిట్స్, మధ్యాహ్న భోజనాన్ని విస్తరించినట్లు తెలిపారు.

విలువలతో కూడిన విద్యే లక్ష్యం
విలువలతో కూడిన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును సలహాదారుగా నియమించుకున్నామని లోకేశ్‌ చెప్పారు. 'తల్లికి చెప్పలేని పనేదీ చేయొద్దు' అనే ఆయన మాట ఎంతో శక్తిమంతమైనదని, ఆ విలువలను విద్యార్థుల్లో నింపేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. మహిళలను కించపరిచే ధోరణిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, "మహిళల జోలికొస్తే లోకేశ్‌ అన్న తోలు తీస్తాడు అని వార్నింగ్ ఇవ్వండి" అంటూ విద్యార్థులకు భరోసా ఇచ్చారు.

డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితంలో తల్లి, గురువు పాత్రను గుర్తుచేస్తూ, ప్రతి గొప్ప వ్యక్తి వెనుక ఒక గొప్ప తల్లి, ఒక గొప్ప గురువు ఉంటారని అన్నారు. ఈ ఏడాది టెన్త్, ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రికార్డులు సృష్టించారని, చరిత్రలో తొలిసారిగా టాపర్ల ఫొటోలతో ప్రభుత్వమే ప్రకటనలు ఇచ్చిందని గుర్తుచేశారు. 

"మీ మార్కులే నా ప్రోగ్రెస్ రిపోర్ట్. మీరు బాగా చదివితేనే సీఎం నాకు మంచి మార్కులు వేస్తారు. నా భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది" అని విద్యార్థులతో అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు నడిచిన రంపచోడవరం గడ్డపై మెగా పీటీఎం నిర్వహించడం గర్వంగా ఉందని, రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని లోకేశ్‌ పిలుపునిచ్చారు.
Advertisement
Nara Lokesh
Andhra Pradesh Education Reforms
Mega Parent Teacher Meeting
Government School Infrastructure
Thalliki Vandanam Scheme
Tribal School Buildings

More Telugu News