Ananthula Satish Kumar: తెలంగాణ ఏసీబీ వలలో మరో అవినీతి చేప.. పంచాయతీ కార్యదర్శిపై ఏసీబీ కేసు

Ananthula Satish Kumar Panchayat Secretary caught in ACB trap
షార్ట్స్‌లో చూడండి
ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు జరగాలంటే కొందరు అధికారులు లంచం ఇస్తేనే ఫైలు కదిలేలా చేస్తారనే ఆరోపణలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా సూర్యాపేట జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. ఒక పని చేసి పెట్టడానికి ఏకంగా రూ.15,000 లంచం డిమాండ్ చేసి, ఆ తర్వాత బేరసారాలతో రూ.8,000కు తగ్గించిన పంచాయతీ కార్యదర్శిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కేసు నమోదు చేశారు.

సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం నాగులపాటి అన్నారం గ్రామ పంచాయతీ కార్యదర్శి అనంతుల సతీష్ కుమార్ ఏసీబీ వలకు చిక్కాడు. బొగ్గు ఉత్పత్తి చేసుకునేందుకు ఒక వ్యక్తికి గ్రామ పంచాయతీ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) అవసరమైంది. ఈ ఎన్ఓసీ ఉంటేనే సూర్యాపేట జిల్లా అటవీ శాఖ నుంచి తదుపరి అనుమతులు లభిస్తాయి. ఈ క్రమంలో సదరు వ్యక్తి పంచాయతీ కార్యదర్శి సతీష్ కుమార్‌ను సంప్రదించారు.

అయితే, ఎన్ఓసీ జారీ చేసేందుకు కార్యదర్శి సతీష్ కుమార్ రూ.15,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు బాధితుడు ఆరోపించారు. అంత మొత్తం ఇవ్వలేనని ఫిర్యాదుదారుడు వేడుకోవడంతో, చివరకు రూ.8,000 ఇస్తే పని చేసిపెడతానని కార్యదర్శి చెప్పినట్లు తెలిసింది. దీంతో విసుగు చెందిన బాధితుడు నేరుగా అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన ఏసీబీ అధికారులు, ప్రాథమిక విచారణ అనంతరం పంచాయతీ కార్యదర్శి అనంతుల సతీష్ కుమార్‌పై కేసు నమోదు చేశారు.

లంచం అడిగితే సంప్రదించండి: ఏసీబీ

ఈ సందర్భంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రజలకు కీలక సూచన చేశారు. ఏ ప్రభుత్వ అధికారి అయినా, ఉద్యోగి అయినా లంచం డిమాండ్ చేస్తే తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఇందుకోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ 1064ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే, వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), అధికారిక వెబ్‌సైట్ (https://acb.telangana.gov.in) ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ అధికారులు వివరించారు. లంచం గురించి సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని వారు హామీ ఇచ్చారు.
Go Back to Shorts
Ananthula Satish Kumar
Telangana ACB
Suryapet
NOC
bribery case
panchayat secretary

More Telugu News