Basara: బాసరలో విషాద ఘటన... గోదావరిలో నీటమునిగి ఐదుగురు మృతి

Basara Tragedy 5 Drown in Godavari River in Nirmal
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన బాసరలో గోదావరి నదిలో పుణ్యస్నానానికి వెళ్లిన ఐదుగురు యువకులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో బాసరలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులంతా హైదరాబాద్‌లోని చింతల్ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు కావడం గమనార్హం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాజస్థాన్‌కు చెందిన ఒక కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. ఈ కుటుంబంలోని మొత్తం 18 మంది సభ్యులు ఆదివారం బాసరలోని సరస్వతీ అమ్మవారి దర్శనం కోసం, అలాగే గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించేందుకు వచ్చారు. ఆలయ దర్శనానికి ముందు, సంప్రదాయం ప్రకారం నదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఐదుగురు యువకులు నదిలోకి దిగి, నీటి ప్రవాహంలో లోపలికి వెళ్లారు. నీటి లోతుపై సరైన అంచనా లేకపోవడంతో వారు ఒక్కసారిగా మునిగిపోవడం ప్రారంభించారు.

నది ఒడ్డున ఉన్న కుటుంబ సభ్యులు ఇది గమనించి కేకలు వేశారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, నిపుణులైన ఈతగాళ్ల సహాయంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టి ఐదుగురి మృతదేహాలను వెలికితీశారు. ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరిగిందని అధికారులు తెలిపారు.

మృతులను రాకేశ్, వినోద్, మదన్, రుతిక్, భరత్‌లుగా గుర్తించారు. వీరంతా 20 ఏళ్ల లోపు వయస్సు వారే కావడం మరింత ఆవేదనకు గురిచేస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

గోదావరి ఘాట్ వద్ద తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు తక్షణమే తగిన భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి, అధికారులకు ఆదేశాలు

ఈ దుర్ఘటనపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదుగురు యువకుల మృతి వార్త తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నదులు, నీటిపారుదల ప్రాజెక్టుల వద్దకు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జలాశయాలు, నదులు, ప్రాజెక్టుల వద్ద లోతును తెలియజేస్తూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ ఏడాది జనవరిలో కొండపోచమ్మ జలాశయంలో ఐదుగురు హైదరాబాద్ విద్యార్థులు సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో నీట మునిగి చనిపోయారని, అలాగే వారం రోజుల క్రితం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీలో ఆరుగురు యువకులు గల్లంతయ్యారని మంత్రి గుర్తుచేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు.
Go Back to Shorts
Basara
Basara tragedy
Godavari river
Nirmal district
Telangana news
Godavari drowning
Poonam Prabhakar
Drowning accident India
Chintal Hyderabad
River safety

More Telugu News