Murali Nayak: మురళీ నాయక్ ప్రతి మహిళ సిందూరంలో నిలిచి ఉంటాడు: సింగర్ మంగ్లీ

- పాక్ తో పోరాటంలో జవాను మురళీ నాయక్ వీరమరణం
- మురళీ కుటుంబాన్ని ఓదార్చిన సింగర్ మంగ్లీ
- మురళీ నాయక్ అందరు అమ్మలకు కొడుకు అయ్యాడని వ్యాఖ్యలు
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని గడ్డం తాండ పంచాయతీ కల్లి తాండా గ్రామానికి చెందిన మురళీ నాయక్ అనే సైనికుడు పాకిస్థాన్ తో పోరాటంలో వీర మరణం చెందడం తెలిసిందే. అతడి కుటుంబం ప్రస్తుతం శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా, ప్రముఖ గాయని మంగ్లీ ఇవాళ కల్లి తాండా విచ్చేసి మురళీ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. గుండెలవిసేలా రోదిస్తున్న మురళీ నాయక్ తల్లిని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా సింగర్ మంగ్లీని మీడియా పలకరించింది.
ఆమె మాట్లడుతూ, మురళీ నాయక్ వీరమరణం పొందాడని అభివర్ణించారు. దేశంలోని మహిళల సిందూరం కాపాడేందుకు ఆపరేషన్ సిందూర్ కోసం తన ప్రాణాలను అర్పించాడని కొనియాడారు. అందుకే, మురళీ నాయక్ దేశంలోని ప్రతి మహిళ సిందూరంలో నిలిచి ఉంటాడని మంగ్లీ భావోద్వగభరితంగా చెప్పారు. మహిళలు సిందూరం పెట్టుకునేటప్పుడు మురళీ నాయక్ వంటి జవాన్ల ప్రాణత్యాగాలను స్మరించుకోవాలని అన్నారు.
ఇక, మురళీ నాయక్ కు అక్క, తమ్ముడు, అన్న, చెల్లి... ఇలా ఎవరూ లేరని, ఒక్కడే కొడుకని, అతడిని కోల్పోయిన ఆ కుటుంబం వేదన వర్ణనాతీతం అని పేర్కొన్నారు. మురళీ ఇవాళ దేశంలోని అందరు అమ్మలకు కొడుకు అయ్యాడని వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మురళీ నాయక్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలవాలని మంగ్లీ కోరారు.