రిపోర్టర్‌గా మారిన బాలికలు.. వైరల్‌ దెబ్బకు దిగొచ్చి రోడ్డు బాగుచేసిన అధికారులు

Raigad schoolgirls turn reporters to highlight bad roads in Maharashtra
  • గుంతల రోడ్డుపై ముగ్గురు బాలికల వ్యంగ్య రిపోర్ట్‌
  • గొడుగును మైక్‌గా వాడిన విద్యార్థినులు
  • సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌
  • స్పందించిన అధికారులు రోడ్డుకు మరమ్మతులు
  • బాలికలను అభినందించిన గ్రామస్థులు
రోడ్డుపై గుంతలు.. బురదతో నిత్యం ఇబ్బందులు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో మహారాష్ట్రలోని ముగ్గురు పాఠశాల విద్యార్థినులు వినూత్నంగా నిరసన తెలిపారు. చేతిలో మొబైల్‌ ఫోన్‌.. మైక్‌కు బదులుగా గొడుగు పట్టుకుని రోడ్డుపై ‘న్యూస్‌ రిపోర్ట్‌’ చేశారు. వారి వ్యంగ్య వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో అధికారులు స్పందించారు. చివరకు రోడ్డుకు మరమ్మతులు చేశారు.

రాయ్‌గఢ్‌కు చెందిన నేహా ఘరే, జ్యోత్స్నా ముకానే, మాన్సీ పవార్‌ పదో తరగతి చదువుతున్నారు. ముగ్గురి వయసు 15 ఏళ్లు. వర్షాకాలం మొదలైనప్పటి నుంచి తమ పాఠశాలకు వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. భారీ గుంతలు, బురదతో విద్యార్థులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు నేహా, జ్యోత్స్నా, మాన్సీ ఓ వినూత్న ఆలోచన చేశారు. నేహా రిపోర్టర్‌గా మారింది. గొడుగును మైక్‌లా పట్టుకుని జ్యోత్స్నాను రోడ్డు పరిస్థితిపై ప్రశ్నించింది. మాన్సీ మొత్తం దృశ్యాలను మొబైల్‌లో చిత్రీకరించింది. గుంతలు, బురదను చూపిస్తూ వ్యంగ్యంగా రూపొందించిన ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్‌ అయింది.

వీడియో అధికారుల దృష్టికి వెళ్లడంతో రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. దీంతో బాలికలకు స్థానికుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబసభ్యులు, గ్రామస్థులు, రాజకీయ నాయకులు వారిని అభినందించారు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్‌ ఠాక్రే కూడా బాలికలను కలవడానికి ఆసక్తి చూపించారు.

‘‘మా కుమార్తెలు చేసిన పనికి గర్వంగా ఉంది. ఇలాంటి సమస్యలను ప్రభుత్వం గుర్తించాలి’’ అని నేహా తండ్రి ఆత్మారామ్‌ ఘరే తెలిపారు.
Advertisement
Neha Ghare
Raigad schoolgirls viral video
Maharashtra road repair news
Jyotsna Mukane Mansi Pawar
Student reporters viral video
Raj Thackeray appreciates students

More Telugu News